Begin typing your search above and press return to search.

ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం!

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:33 AM GMT
ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో కాల్ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నాయి. అది ఒరిజిన‌ల్ వీడియో అని టీడీపీ అమెరికాలోని ఎక్లిప్స్ సంస్థ‌తో ధ్రువీక‌ర‌ణ చేయించింది. అయితే తాము ఆ వీడియో ఒరిజిన‌ల్ అని చెప్ప‌లేద‌ని ఎక్లిప్స్ తెలిపిందంటూ ఏపీ సీఐడీ విభాగం చీఫ్ సునీల్ కుమార్ వెల్ల‌డించారు. మ‌రోవైపు అనంత‌పురం ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప కూడా అది ఒరిజిన‌ల్ వీడియో కాద‌ని తెలిపారు. అయితే అది ఒరిజిన‌ల్ వీడియో అని.. ఏ సంస్థ‌కు ప‌రీక్ష‌కు పంప‌కుండా అది ఒరిజిన‌ల్ వీడియో కాదని ప్ర‌భుత్వం ఎలా చెబుతుందంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి.

మ‌రోవైపు గోరంట్ల మాధ‌వ్ త‌న వీడియోను ప్ర‌సారం చేశాయ‌ని కులం పేరు పెట్టి చంద్ర‌బాబుతోపాటు కొన్ని మీడియా సంస్థ‌ల అధినేతల‌ను బూతులు తిట్టారు. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం గోరంట్ల మాధ‌వ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌మ్మ సంఘాలు మాధ‌వ్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశాయి.

మ‌రోవైపు ఏపీలోని డిగ్నిటీ ఫ‌ర్ ఉమెన్ జేఏసీ నేత‌లు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి గోరంట్ల మాధ‌వ్ పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. మ‌హిళ‌ల గౌర‌వాన్ని పోగొట్టిన ఎంపీ మాధ‌వ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఈ వ్య‌వ‌హారంపై స్పందించింది. ఆయ‌న‌పై తగిన‌ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కి సూచించింది. ఆగ‌స్టు 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని సీఎస్‌కు పంపి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కార్యాల‌య వ‌ర్గాలు తెలిపాయి.

అదేవిధంగా డిగ్నిటీ ఫ‌ర్ ఉమెన్ మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లేఖ కూడా పంపింది. ఇప్ప‌టికే మ‌హిళా సంఘాల నేత‌లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కూడా కలిసి ఒక నివేదిక సమర్పించారు. కేంద్ర ఫోరెన్సిక్కి పంపి ఎంపీ వీడియో వ్యవహారం తేల్చాల‌ని విన్న‌వించారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు నిర్వ‌హించాల‌న్నారు. ఇదే వ్యవహారం పైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ సైతం డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డికి లేఖ రాశారు.

తాజాగా రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఏపీ సీఎస్‌కు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించ‌డంతో మ‌రోమారు గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ కూడా ఆ వీడియో ఫేక్ అని తేల్చే అవ‌కాశ‌మే ఉంద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న ఎలాంటి నివేదిక ఇచ్చే చాన్సే లేద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.