Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ను బోనులో నిలబెట్టబోతున్న ఆర్కే

By:  Tupaki Desk   |   4 July 2018 4:38 AM GMT
పవన్ కళ్యాణ్ ను బోనులో నిలబెట్టబోతున్న ఆర్కే
X
ప్రతిపక్ష నాయకుడు జగన్ పై ఎన్నో విమర్శలు.. ఎన్నో ‘పచ్చ’రాతలు.. చంద్రబాబు అనుకూల మీడియా అంతా కత్తిగట్టి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేశారు. కానీ మొక్కవోని ధైర్యంతో జగన్ పత్రికలు - మీడియాలను ఎదుర్కొన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించారు. కానీ ఏనాడు ఆ మీడియా సంస్థల అధినేతల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయలేదు.. మీడియా వ్యవస్థకు విలువనిచ్చి రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు విమర్శలను సద్వివిమర్శగా భావించి ఉన్నత నాయకుడిగా ఎదిగారు..

కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారు. సినిమాల్లో ఆయన పవర్ స్టార్. సినీ రంగానికే పరిమితం.. కాబట్టి ఇన్నాళ్లు ఎవరూ ఆయన జోలికి పోలేదు. కానీ ప్రజాజీవితంలోకి వచ్చాక ఆయన అందరివాడు.. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి.. విమర్శలుంటాయి.. వాటన్నింటిని తట్టుకొని మీడియాను కాచుకొని ముందుకెళ్లినప్పుడే నిజమైన నాయకుడు అవుతారు.. కానీ పవన్ లో రాజకీయ నాయకుడి కంటే సినిమాల్లో హీరో పాల్లే ఎక్కువ ఉన్నాయి. అందుకే తనపై కత్తిగట్టిందంటూ మీడియాపైనే ఎదురు తిరిగారు. తెలుగులో టాప్ చానెళ్లుగా ఉన్న టీవీ9 - ఏబీఎన్ సంస్థల అధినేతలను టార్గెట్ చేసి వారి వ్యక్తిగత జీవితాలను ట్విట్టర్ సాక్షిగా అప్పట్లో బజారుకీడ్చారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.

సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఫిలించాంబర్ ఎదుట సినీ నటి శ్రీరెడ్డి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.. దీనిపై పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడింది. ఆయనను తీవ్రంగా దూషించింది. ఆ దూషణలో పవన్ తల్లిని కించపరిచే విధంగా ఓ పదం వాడింది. ఇది అన్నీ మీడియాల్లో ప్రముఖంగా ప్రసారమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23వరకు ట్విట్టర్ లో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి అనుచిత ట్వీట్లు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ కుటుంబాన్ని లాగి ఆయనను బజారుకీడ్చారు. ఆ ట్వీట్లతో పాటు రాధాకృష్ణ ఫొటోలను కూడా ట్విట్టర్ లో పెట్టారు. నిజానికి ఏబీఎన్ కంటే కూడా కొన్ని చానెళ్లలో అంతకంటే ఎక్కువగానే ప్రచారం చేశారు. కానీ పవన్ కేవలం టీవీ9 - ఏబీఎన్ ను మాత్రమే టార్గెట్ చేసి మిగతా వారిని పల్లెత్తు మాట కూడా అనకపోవడం విశేషం.

పవన్ కళ్యాణ్ ట్వీట్ల పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అభ్యంతరం తెలిపారు. క్షమాపణ చెప్పాలని తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. పవన్ నుంచి స్పందన లేకపోవడంతో రాధాకృష్ణ రూ.10 కోట్లకు పవన్ పై పరువునష్టం దావా వేశారు. ఈ నెల 24న కోర్టుకు స్వయంగా కానీ న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 3వ అదనపు జడ్జి పవన్ ను ఆదేశించారు.