Begin typing your search above and press return to search.

అరెస్టు చేశాక లోపల వేయక ఫోటోలు దిగారు.. నిందితులు జంప్ అయ్యారు

By:  Tupaki Desk   |   17 Oct 2020 5:15 AM GMT
అరెస్టు చేశాక లోపల వేయక ఫోటోలు దిగారు.. నిందితులు జంప్ అయ్యారు
X
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసులు వ్యవహరించిన తీరు షాకింగ్ గా ఉండటమే కాదు.. నిందితులు వారికి మస్కా కొట్టిన తీరు సంచలనంగా మారింది. పని మీద పెట్టే శ్రద్ధకు మించి ఫోటోల మీద పెట్టటం.. సందట్లో సడేమియా అన్నట్లుగా వ్యవహరించారు లిక్కర్ మాఫియా టీం. ఇంతకూ ఏం జరిగిందంటే?

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని తీర ప్రాంతమైన పల్లం గ్రామంలో అక్రమ మద్యాన్ని తీసుకొస్తున్న లిక్కర్ మాఫియాకు చెందిన కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరికి బేడీలు కూడా వేశారు. ఈ సందర్భంగా భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాము చేసిన ఘనకార్యానికి మురిసిపోయారు పోలీసులు. అంతే.. నిందితుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించి.. విచారించాల్సిన పోలీసులు.. నిందితుల్నిపట్టుకున్నామన్న సంతోషంతో ఫోటో షూట్ మొదలు పెట్టారు. తాము స్వాధీనం మద్యం బాటిళ్లను.. అదుపులోకి తీసుకున్న నిందితులతో ఫోటోలు దిగటం మొదలు పెట్టారు.

పోలీసుల జోష్ చూసిన నిందితులకు కొత్త ఆలోచన వచ్చింది. అదే సమయంలో నిందితులు తెచ్చిన అక్రమ మద్యాన్ని తీసుకెళ్లటానికి వచ్చిన పది మందితో కలిసి.. పోలీసుల మీద ఎదురుదాడి చేయటం.. ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోయిన వారు.. తేరుకునే లోపు నిందితులు జంప్ అయ్యారు. అలా పారిపోయిన నిందితుల్లో ఇద్దరి చేతులకు బేడీలు కూడా ఉండటం గమనార్హం. నిందితుల్ని అదుపులోకి తీసుకొని.. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా ఫోటోలు తీసుకొని ప్రచారం చేసుకోవాలన్న తీరు.. అసలుకే ఎసరు తెచ్చేలా చేసింది. పారిపోయిన నిందితుల్ని పట్టుకునేపనిలో జిల్లా పోలీసులు పడితే.. చేసిన ఘనకార్యానికి చర్యలు తప్పవన్న మాట వినిపిస్తోంది.