Begin typing your search above and press return to search.

ఫిరాయింపుల వేళ.. ఆదిత్య ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   21 July 2022 4:31 AM GMT
ఫిరాయింపుల వేళ.. ఆదిత్య ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం!
X
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వంలో శివ‌సేన రెబ‌ల్ నేత ఏక‌నాథ్ షిండే సృష్టించిన తిరుగుబాటుకు ఆ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. దీంతో శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అలాగే శివ‌సేన ఎమ్మెల్యేలు మొత్తం 55 మందిలో 42 మంది ఏక‌నాథ్ షిండేకే జైకొట్టారు. అలాగే తాజాగా 18 మంది ఎంపీల్లో 12 మంది ఏక‌నాథ్ తో చేరిపోయారు. వీరితోపాటు వివిధ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల్లో కార్పొరేట్ల‌ర్లు, మేయర్లు, చోటామోటా నేత‌లు కూడా ఏక‌నాథ్ తో అడుగులు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉద్ధ‌వ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఏకనాథ్ శిబిరంలో చేరుతున్న‌వారిని ఆపేందుకు మూడు రోజులపాటు మ‌హారాష్ట్ర‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలు.. భివండీ, నాసిక్, దిండోరీ, శంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఆయ‌న ప‌ర్య‌టిస్తార‌ని చెబుతున్నారు. ఆదిత్య ఠాక్రే ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించిన ప్రణాళికను శివ‌సేన‌ పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయ‌ని అంటున్నారు.

ఆదిత్య ఠాక్రే 'మన భగ్‌వా (కాషాయం జెండా)-మనదే శివసేన' అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాల్లో పర్యటిస్తూ ఏక‌నాథ్ షిండే పార్టీకి ద్రోహం చేశార‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నార‌ని అంటున్నారు.

వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగ‌డ‌తార‌ని స‌మాచారం. అదేవిధంగా ఆయా నియోజకవర్గాలలోని శివసేన ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలతోనూ ఆదిత్య ఠాక్రే చ‌ర్చిస్తార‌ని చెబుతున్నారు. ఏక‌నాథ్ షిండే వర్గంలో చేరొద్ద‌ని, పార్టీ మ‌న చేతుల్లోనే ఉంద‌ని వారికి భ‌రోసా ఇస్తార‌ని పేర్కొంటున్నారు.

కాగా ఏక‌నాథ్ షిండే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీనపడుతోంద‌ని అంటున్నారు. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నార‌ని చెబుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే తరచూ పార్టీ నేత‌లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో తన తండ్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య ఠాక్రే భావించార‌ని.. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప‌ర్య‌ట‌నకు శ్రీకారం చుట్టార‌ని చెబుతున్నారు.