Begin typing your search above and press return to search.

14 ఏళ్ల తర్వాత ఆ దేశంలో నూడిల్స్ ధరలకు రెక్కలు

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:52 AM GMT
14 ఏళ్ల తర్వాత  ఆ దేశంలో నూడిల్స్ ధరలకు రెక్కలు
X
ఎక్కడో సంబంధం లేని దేశంలో యుద్ధం ఏమిటి? దానికి సుదూరాన ఉన్న దేశంలో నూడిల్స్ ధరలకు రెక్కలేంటి? ప్రపంచం కుగ్రామంగా మారిన వేళ.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. దాని ప్రభావం ప్రపంచం మీద పడే పరిస్థితి. కరోనా మహమ్మారి ప్రపంచానికి ఒకలాంటి సమస్యల్ని తెచ్చి పెడితే.. దాని నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి ఉక్రెయిన్ - రష్యాల మధ్య మొదలైన యుద్ధం ఊహించని ఉపద్రవంలా మారింది. వీటికి విపత్తులు తోడు కావటంతో సామాన్యుడి బతుకు పోరు అంతకంతకూ కష్టంగా మారిన పరిస్థితి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల తర్వాత థాయిలాండ్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్ స్టెంట్ నూడిల్స్ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుంది. మన దేశంలో బియ్యం.. గోధుమలు రోజువారీ తిండికి ఎలా ఉపయోగిస్తామో.. కొన్ని దేశాల్లో నూడిల్స్ ను పెద్ద ఎత్తున వినియోగిస్తుంటారు. అలాంటి దేశాల్లో థాయ్ లాండ్ ఒకటి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ దేశంలో నూడిల్స్ ధరలు భారీగా పెరిగాయి.

ఇన్ స్టెంట్ నూడిల్స్ ధరల్ని పెంచుతూ థాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తాజాగా అమల్లోకి వచ్చాయి. దాదాపు పద్నాలుగేళ్లు.. అంటే 2008లో చివరిసారి ఆ దేశంలో నూడిల్స్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ పెంచింది లేదు.

అయితే.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో గోధుమల ధరలతో పాటు చమురు ధరలు పెరగటం.. రవాణా ఛార్జీల్లో పెంపు లాంటి పరిణామాలతో నూడిల్స్ ను ఉత్పత్తి చేసే సంస్థలు తమ ధరల్ని పెంచేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరాయి. దీంతో.. ఆ దేశం ధరల పెంపునకు అనుమతి ఇవ్వక తప్పలేదు.

పెరిగిన ధరలు ఎంత ఉన్నాయన్న దానికి.. చిన్న పాకెట్ కు దగ్గర దగ్గర రూ.2.50 చొప్పున పెరిగినట్లుగా చెబుతున్నారు. గడిచిన కొద్ది కాలంగా ఆ దేశంలో గోధుమ పిండి ధర 20-30 శాతం పెరిగితే.. పామాయిల్ ధర రెండింతలు పెరిగినట్లుగా చెబుతున్నారు.

థాయ్ లాండ్ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. అందుకే.. తాజాగా ధరల్ని పెంచక తప్పలేదు. ఒక్క థాయ్ లాండ్ లోనే కాదు.. జపాన్.. దక్షిణ కొరియాతో పాటు పలు ఆసియా దేశాల్లోనూ నూడిల్స్ ధరలు పెరిగినట్లుగా చెబుతున్నారు.చైనా లోనూ ఈ ఏడాది గోధుమల ధరలో 30 శాతం పెంపు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ధరాఘాతం మనదేశంలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. ఆసియాలోని పలు దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమవుతుందని చెప్పాలి.