Begin typing your search above and press return to search.

ఏకాకిగా మారిన అఖిలప్రియ.. చేతులారా చేసుకున్నదేనా?

By:  Tupaki Desk   |   28 March 2022 1:30 PM GMT
ఏకాకిగా మారిన అఖిలప్రియ.. చేతులారా చేసుకున్నదేనా?
X
అందుకే అంటారు అగ్రస్థానానికి చేరుకోవటం కొన్నిసార్లు తేలికే. కానీ.. దాన్ని నిలబెట్టుకోవటంలోనే సమస్యంతా. కర్నూలు జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో రాజకీయాలన్నంతనే గుర్తుకు వచ్చేది భూమా ఫ్యామిలీనే. భూమా నాగిరెడ్డి.. శోభానాగిరెడ్డిలు ఆ ప్రాంత రాజకీయాల్నితీవ్రంగా ప్రభావితం చేసేవారు. కాలం పెట్టిన పరీక్షలు.. ఈ ఇద్దరు దంపతులు అకస్మాత్తుగా మరణించటంతో వారి కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన పరిస్థితి. పగోడికి సైతం ఇలాంటి కష్టం రాకూడదన్నట్లు ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు.. అందుకు తగ్గట్లే చిరు ప్రాయంలో.. ఆమెకు అర్హత ఉన్నది లేనిది అన్నది చూడకుండా మంత్రి పదవిని కట్టబెట్టేశారు.

దీంతో.. భూమా అఖిలప్రియ ఒక్కసారిగా శక్తివంతులయ్యారు.అలాంటి వేళ.. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. తెలిసి తెలియనితనం.. తన తల్లిదండ్రుల్లో పుష్కలంగా ఉన్న రాజకీయ చతురత అఖిలప్రియలో లోపించటంతో.. తన తండ్రికి అత్యంత సన్నిహితులైన వారిని దూరం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరిగా దూరం చేసుకున్న ఆమె.. తాజా పరిస్థితి చూస్తే.. ఆమెను ఆమె సన్నిహితులంతా పక్కన పెట్టేశారన్న భావన కలుగక మానదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఈ వాదనకు బలం చేకూరేలా ఉన్నాయని చెప్పాలి.

మొన్నటికి మొన్న ఆళ్లగడ్డలో తన తల్లిదండ్రుల విగ్రహాలను భూమా కుటుంబ సభ్యుడు.. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ ఛార్జి భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేస్తే.. దాన్ని ఎవరికి చెప్పకుండా.. పిలవని పేరంటానికి వెళ్లిన అఖిలప్రియ.. ఆ విగ్రహాల్ని ఆవిష్కరించి అభాసుపాలయ్యారు. తమ సొంత స్థలంలో సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని అఖిలప్రియ ఎలా ప్రారంభిస్తారంటూ నియోజకవర్గం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో తాజాగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు భూమా అఖిలప్రియ.. ఆమె సోదరుడిని తప్పించి.. మిగిలిన బంధువులందరికి ఆహ్వానాలు పంపారు. దివంగత భూమాకు రామిరెడ్డి ఎంతటి సన్నిహితులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంతేనా.. రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పెల్లి జరిగితే.. దానికి అఖిలప్రియకు ఆహ్వానం అందలేదు. బ్రహ్మానందరెడ్డికి అఖిలప్రియ చెల్లెలు వరుస అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే భూమానాగిరెడ్డికి కుడిభుజం లాంటి ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డి ఎంగేజ్ మెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడితో వారి ఎంగేజ్ మెంట్ అయ్యింది. వీరిద్దరు అమెరికాలో కలిసి చదువుకునే సమయంలో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం కూడా అఖిలప్రియకు అందలేదు. ఇదంతా చూస్తే.. భూమా కుటుంబం మొత్తం అఖిలప్రియను దూరం చేసి.. ఆమెను ఏకాకిగా మార్చారన్ని మాట బలంగా వినిపిస్తోంది. ఇదంతా కూడా అఖిలప్రియ స్వయం కృతాపరాధమన్న మాట పలువురినోట వినిపిస్తోంది.