Begin typing your search above and press return to search.

అమ్మ తర్వాత చిన్నమ్మేన‌ట‌

By:  Tupaki Desk   |   11 Dec 2016 6:08 AM GMT
అమ్మ తర్వాత చిన్నమ్మేన‌ట‌
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే ఉంది. అమ్మ త‌ర్వాత చిన్నమ్మ శ‌శిక‌ళేనన్న‌ది అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతలు ప్రస్తుతం కోరస్‌గా వినిపిస్తున్న డిమాండ్. సీఎం ప‌న్నీర్ సెల్వంతో సహా పార్టీనేతలు ఆమెను కలుసుకోవడంలో తప్పులేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇక ప్రధాన కార్యదర్శి పీఠం మీద అమ్మ ఒకప్పటి సహాయకురాలు అధిష్ఠించడం కేవలం లాంఛనమే అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ అధినేతగా శశికళ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.

అన్నాడీఎంకేలో నాయకత్వం కోసం కుమ్ములాట ఏదీ జరుగడం లేదని, సీఎంతో సహా పార్టీ నేతలు శశికళను కలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సంస్థాగత కార్యదర్శి సీ పొన్నయ్యన్ చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆమెకు మాత్రమే పార్టీని నడిపించే సత్తా ఉందని సెంగోటయ్యన్ వంటి సీనియర్ నేతలు బాహాటంగానే శశకళకు మద్దతు తెలుపుతున్నారు. 30 ఏళ్లుగా అమ్మను కనిపెట్టకుని ఉన్న చిన్నమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టాలని వలర్మతి అనే సీనియర్ మహిళా నేత ప్రకటించారు. అమ్మలో చిన్నమ్మను చూస్తున్నామని పార్టీ నేతలు చెప్తున్నారు. అన్నాడీఎంకే అధ్యక్ష వర్గ చైర్మన్ ఈ మధుసూదనన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై శ‌శికళను కలుసుకొని పార్టీ నాయకత్వాన్ని చేపట్టాల్సిందిగా కోరారు. దివంగత తమిళ సీఎం జయలలిత సహాయకురాలు శశికళ చేతికి అన్నాడీఎంకే పార్టీపగ్గాలు అప్పగించాలని సీనియర్ నేతలు కోరుకుంటున్నారని పార్టీ త‌ర‌ఫున‌ ట్విట్టర్ సందేశంలో పేర్కొనడం విశేషం. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు పొన్నయ్యన్ సమాధానమిస్తూ, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.. త్వరలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పారు.

ఇటీవల మంత్రులు కొందరు శశికళను కలుసుకున్న సంగతిని ప్రస్తావిస్తే అందులో తప్పేముందని పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన పొన్నయ్యన్ ఎదురు ప్రశ్న వేశారు. శశికళ భర్త నటరాజన్, ఇతర కుటుంబ సభ్యు లు పోషిస్తున్న పాత్ర గురించి అడిగితే ఇది అనవసరమైన ప్రశ్న అంటూ విసుక్కున్నారు. అన్నాడీఎంకేను అమ్మ ఒక కోటలా నిర్మించారని చెప్పారు. జయలలితకు చెందిన 113.72 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఎవరు వారసులు అనే విషయం స్పష్టం కావడం లేదు. జయ ఏదైనా వీలునామా రాశారా? అని అడిగితే పొన్నయ్యన్ స్పందిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం తన దగ్గర లేదని చెప్పారు. ఈ విషయమై ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు. పోయస్ గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక కేంద్రంగా మారుస్తారా? అని అడిగితే ఆ సంగతి పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.