Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ హీరో.. పొలాల్లో మొదలెట్టాడు

By:  Tupaki Desk   |   4 Feb 2018 12:31 PM GMT
ప్రపంచకప్ హీరో.. పొలాల్లో మొదలెట్టాడు
X
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రియుల చర్చలన్నీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టు గురించే సాగుతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో కూడిన ఆటతో అదరగొడుతూ.. భారీ విజయాలతో ప్రపంచకప్‌ ను ఒడిసిపట్టిన కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ టోర్నీలో అందరి కంటే ఎక్కువ ఆకట్టుకున్నది.. ఐదు ఇన్నింగ్సుల్లోనే ఏకంగా 124 సగటుతో 372 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ గెలిచింది శుభ్‌ మన్ గిల్. పంజాబ్‌ కు చెందిన ఈ కుర్రాడు పుట్టింది రైతు కుటుంబంలో కావడం విశేషం. అతడి తండ్రి వ్యవసాయం చేస్తాడు. వారికి పొలాలు కొంచెం భారీగానే ఉన్నాయి. శుభ్‌మన్ క్రికెట్ ప్రస్థానం మొదలైందే పొలాల్లో కావడం విశేషం.

చిన్నపుడే క్రికెట్ మీద ఆసక్తి చూపించాడు శుభ్‌మన్. ఐతే వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ తల్లిదండ్రులు అతడి ఇష్టానికి అడ్డు చెప్పలేదు. చదువు కోసం పోరు పెట్టలేదు. అతడి ఇష్టాన్ని కాదనకుండా క్రికెట్ లోకి వదిలేశారు. శుభ్‌ మన్ తొలి సాధన పొలాల్లానే సాగడం విశేషం. తండ్రి తన పొలంలోని సహాయకులను బంతులు విసరమనేవాడు. ఇలా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న శుభమన్‌‌కు ఏడేళ్లు వచ్చేప్పటికి క్రికెట్టే అతడి కెరీర్‌ అని డిసైడైపోయింది కుటుంబం. అతడి కోసం కోసం తండ్రి లఖ్వింధర్‌ సొంత ఊరు.. పొలాల్ని విడిచిపెట్టి కుటుంబాన్ని మోహాలీకి తరలించాడు. బింద్రా స్టేడియం సమీపంలోనే అద్దె ఇల్లు తీసుకొని కొడుక్కి శిక్షణ ఇప్పించాడు. టీనేజీలో చదువు కొనసాగిస్తూనే రోజూ నాలుగు గంటల పాటు సాధన చేసేవాడు శుభ్‌మన్. అండర్‌-16 స్థాయిలో అంతర్‌ జిల్లా టోర్నీలో ఓ ఇన్నింగ్స్‌లో ఏకంగా 356 పరుగులు చేయడంతో అతడి పేరు మార్మోగింది. తర్వాత పంజాబ్ జట్టుకు ఆడుతూ డబుల్ సెంచరీ బాదడంతో అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే.