Begin typing your search above and press return to search.

దిగ్గజ కంపెనీపైనా తప్పని లంచాల ఆరోపణలు.. రూ.వేల కోట్లలోనే ముడుపులు

By:  Tupaki Desk   |   26 March 2022 12:31 PM GMT
దిగ్గజ కంపెనీపైనా తప్పని లంచాల ఆరోపణలు.. రూ.వేల కోట్లలోనే ముడుపులు
X
ఇప్పుడంటే.. అమెజాన్, టెస్లా.. ఏవేవో సంస్థలు వచ్చేసి ప్రపంచంలో అత్యంత ధనవంతమైన కంపెనీలుగా ఎదిగాయి కానీ.. ఓ 20 ఏళ్ల కిందట మైక్రోసాఫ్ట్ అంటే అబ్బో అనేవారు. అందులో ఉద్యోగం అంటే కళ్లూమూసుకుని పిల్లనిచ్చేవారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించైతే కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆయన చూపు సోకితేనే చాలనంతేగా సీఎంలు సంబర పడిపోయేవారు. దీనికితగ్గట్లే బిల్ గేట్స్ ప్రపంచంలోనే ధనవంతుడిగా నిలిచారు. కానీ, కాలం మారిపోయి.. కొత్తకొత్త సాంకేతికతలు పుట్టకురావడంతో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు మిగతా సంస్థల కంటే వెనుకబడింది. లేదంటే వాటి సరసన నిలిచిపోయింది. అయితే, విలువ పరంగా సాఫ్ట్ వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ కు దాని స్థానం దానికుంది. కాగా, అలాంటి సంస్థలో లంచాలకు రూ.వేల కోట్ల కేటాయింపు జరిగిందంటూ ఓ మాజీ ఉద్యోగి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

విదేశాల్లో ఒప్పందాల ఖరారుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారీ ఎత్తున లంచాలు ఇస్తోందని యాసర్‌ ఎలాబ్‌ అనే మాజీ ఉద్యోగి ఆరోపించాడు. అదికూడా తక్కువ మొత్తంలో కాకుండా.. పెద్దఎత్తున ఇస్తున్నట్లు తెలిపాడు.ముడుపులు, లంచాల కోసం ఏటా 200 మిలియన్ డాలర్లు (₹1.5 వేల కోట్లు) కేటాయిస్తున్నట్లు చెప్పాడు. ఈ మేరకు ఆయన ప్రజావేగుల వేదికగా మారిన లయనెస్‌ వెబ్‌సైట్‌లో ఓ వ్యాసం రాశాడు. కాగా ఘనా, నైజీరియా, జింబాబ్వే, కతార్‌, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఒప్పందాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్లు ఎలాబ్‌ ఆరోపించాడు. 1998లో సంస్థలో చేరిన ఇతడు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో సంస్థ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంపై పనిచేశాడు.

ఈ క్రమంలో తన పనితీరును మెచ్చి కంపెనీలో పలు పదోన్నతులు పొందినట్లు పేర్కొన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత సంస్థలో కొంత వింత పోకడను గమనించానని ఎలాబ్‌ తెలిపారు. తన కంటే కింది హోదాలో అనేక మంది ఉద్యోగులు విలాసవంతమైన కార్లు, విల్లాలు కొనుక్కొని జీవితం గడుపుతున్నట్లు గమనించానన్నారు. తాను మాత్రం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇల్లు కొనడానికే కష్టపడ్డానని చెప్పాడు. 2016లో 40 వేల డాలర్ల మంజూరుకు తనకు ఓ అభ్యర్థన వచ్చిందని తెలిపాడు. ఓ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈ మొత్తం కావాలని కోరినట్లు తెలిపారు. కానీ, కస్టమర్‌కు సంబంధించిన వివరాలు కంపెనీ 'పొటెన్షియల్‌ క్లయింట్స్‌' డేటాబేస్‌లో లేవని తెలిపారు.

తీరా చూస్తే ఆ క్లయింట్‌ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగేనని తేలిందన్నాడు. నాలుగు నెలల క్రితమే అతణ్ని సంస్థ బయటకు పంపిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సంస్థతో ఆరు నెలల వరకు ఎలాంటి భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పై స్థాయి వారి దృష్టికి తీసుకెళితే.. 40 వేల డాలర్ల మంజూరును నిలిపివేశారని ఎలాబ్‌ తెలిపారు.

కానీ, ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులపై మాత్రం ఎలాంటి విచారణకు ఆదేశించలేదని వెల్లడించారు. సీఈఓ సత్య నాదెళ్ల, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఉపాధ్యక్షుడికి కూడా లేఖ రాశానన్నారు. విషయాన్ని నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లినందుకు తనపై ప్రతీకార చర్యలు ప్రారంభించారన్నారు. అప్పటి వరకు 'స్టార్‌ పెర్ఫార్మర్‌'గా ఉన్న తనను 'పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌'లో చేర్చారని ఆరోపించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డుకు కూడా ఈ విషయాన్ని తెలియజేశానన్నారు.

అక్కడి నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్నారు. తనతో పాటు మరో ఐదుగురు కూడా మైక్రోసాఫ్ట్‌లో జరుగుతున్న అవినీతి గురించి గళం విప్పానన్నాడు. వారందరినీ సంస్థ నుంచి బయటకు పంపారని తెలిపాడు. అదంతా అబద్ధం.. మైక్రోసాఫ్ట్ ఎలాబ్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ వివరణ ఇచ్చింది. కంపెనీలో ఎలాంటి అనైతిక చర్యలకు అవకాశం ఇవ్వబోమని తెలిపింది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులను అనుమతించబోమని పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగితే ఎవరైనా తమ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు కంపెనీలో ఉందని తెలిపింది. ఎలాబ్‌ చేసిన ఆరోపణలు చాలా పాతవని.. వీటిపై ఇప్పటికే విచారణ జరిపి సమస్యను పరిష్కరించామని వివరించింది.