Begin typing your search above and press return to search.

ఆర్థిక మేధావి మ‌ళ్లీ మోడీపై ఫైర‌య్యాడు

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:49 AM GMT
ఆర్థిక మేధావి మ‌ళ్లీ మోడీపై ఫైర‌య్యాడు
X
నోబెల్‌ పురస్కార గ్రహీత - ప్రఖ్యాత ఆర్థిక వేత్త - భారతరత్న అమర్త్యసేన్ మ‌రోమారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500 - రూ. 1,000 నోట్లను అర్థంతరంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ‘నిరంకుశత్వం - నియంతృత్వం’గా అభివర్ణించారు. "న‌ల్లధనాన్ని రూపుమాపడంగా చెబుతున్న దీని వెనుక ఉద్దేశాన్ని భారతీయులంతా ప్రశంసించవచ్చు. కానీ ఆ పని చెయ్యడానికి ఇంతకన్నా మంచి దారి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల సాధించేది తక్కువ - ఇబ్బందులు ఎక్కువ" అని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఒక టీవీ ఛానెల్‌తో ఫోన్‌ లో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల నల్లధనంలో నగదు రూపంలో బయటికొచ్చేది చాలా కొద్ది మొత్తమేననీ - అది దాదాపు ఆరు శాతం లేదా పది శాతంకన్నా తక్కువ ఉండొచ్చని చెబుతూ "లక్ష్య సాధన విషయంలో దీనివల్ల ఒనగూరేది చాలా తక్కువ. అయితే భారత ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద విఘాతం” అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తీసుకున్న ఈ చొరవపై మిగిలిన విమర్శకుల తీరులోనే అమర్త్యసేన్‌ కూడా స్పందిస్తూ, ప్రధాని ఉద్దేశానికి తాను మద్దతిస్తానంటూనే, ఈ సంస్కరణ అమలులో లోపాలున్నాయన్నారు. "నల్ల డబ్బు విషయంలో ఏదైనా చెయ్యాల్సి ఉందని మనం అందరం అనుకుంటాం. కానీ, ప్రభుత్వ చర్యలో అటు వివేకమూ లేదు - ఇటు మానవత్వమూ లేదు. ఇది జరిగి ఉండాల్సింది కాదు" అని చెప్పారు.

పెద్ద నోట్ల ర‌ద్దుపై సానుకూలంగా, ఇటు అనుకూలంగా స్పందనలు వస్తున్న ఒక ఆర్థిక విధానంపై ‘నిరంకుశత్వం’ లాంటి విశేషణాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ "నిరంకుశత్వం అనే మాటను కరెన్సీ మీద విశ్వాసాన్ని నాశనం చెయ్యడం గురించి ఉపయోగించాను" అని అమ‌ర్త్య‌సేన్‌ చెప్పారు. రూపాయి నోటు ప్రామిసరీ నోటు లాంటిదని ఆయన చెబుతూ ఒక ప్రాథమికమైన హామీని నిలబెట్టుకోలేని ఏ ప్రభుత్వమూ గౌరవం పొందలేదని స్పష్టం చేశారు. "మీకు మేం చెల్లించేది లేదని హఠాత్తుగా ఒక ప్రభుత్వం చెబితే - అది నిరంకుశత్వం. నేను పెట్టుబడిదారీ విధానానికి అభిమానిని కాదు. కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో విశ్వాసం కీలకం. ఇప్పుడిది పూర్తిగా విశ్వాసానికి విరుద్ధంగా వెళ్తోంది. ఆర్థిక వ్యవస్థనూ - పెట్టుబడిదారీ వ్యవస్థలోని అత్యంత మౌలిక లక్షణాన్నీ దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది. రేపు బ్యాంకు ఖాతాల విషయంలో ప్రభుత్వం ఇదే పని చెయొచ్చు - తాము దొంగ డబ్బు కూడబెట్టుకోలేదని ప్రజలు రుజువు చేసుకోలేకపోతే నిర్దిష్ట మొత్తానికి మించి అనుమతించకపోవచ్చు” అని అమ‌ర్త్య‌సేన్‌ తెలిపారు. కాగా, ప్రధానితో తనకున్న సిద్ధాంత వైరుధ్యాలే నోట్ల రద్దుమీద ఈ విమర్శలకు కారణమన్న విమర్శను ఆయన తోసిపుచ్చారు. ”నల్ల డబ్బును రూపుమాపాలని మోడీ కోరుకోవడాన్ని నేను ఎన్నటికీ విమర్శించను. ఒకవేళ ఆ పని విజయ.వంతంగా చేస్తే, నేను పూర్తిగా ఆరాధిస్తాను - అభినందిస్తాను. కానీ, ఈ చర్యవల్ల చట్టానికి బద్ధులై జీవించే పౌరులు, తెల్ల డబ్బుతో బతికే ప్రజల జీవితాలు చాలా ఇబ్బందులపాలవుతాయన్నది నా ఆందోళన. మోడీతో నా విభేదాలు భారతదేశం పట్ల మాకున్న దృక్పథానికి సంబంధించినవి. ప్రభుత్వంతో విభేదిస్తున్నారనే కారణంతో, కొందరు వ్యక్తులను దేశ ద్రోహులుగా ప్రకటించే లైసెన్సు 31 శాతం మాత్రమే ఓట్ల పునాది కలిగిన బీజేపీకి లేదని నేను చెప్పదల్చుకున్నాను” అని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీకి అమర్త్యసేన్‌ తీవ్ర విమర్శకుడు. బీహార్‌ లోని ప్రతిష్టాత్మకమైన నలంద విశ్వవిద్యాలయం బోర్డు సభ్యత్వం నుంచి ప్రభుత్వం ఇటీవల ఆయనను తొలగించింది. కాగా, ఎన్‌ డిఎ హయాంలో - అటల్‌ బీహారీ వాజ్‌ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమర్త్యసేన్‌ కు భారతరత్న పురస్కారం లభించడం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/