Begin typing your search above and press return to search.

అంబానీ కేసు: హిరేన్ - సచిన్ మంతనాలు సీటీవీ ఫుటేజ్ లభ్యం!

By:  Tupaki Desk   |   19 March 2021 11:54 AM GMT
అంబానీ కేసు: హిరేన్ - సచిన్ మంతనాలు సీటీవీ ఫుటేజ్ లభ్యం!
X
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో ఎన్ ఐ ఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ, గురువారం అతడికి చెందిన రెండు ఖరీదైన కార్లను ఆధీనంలోకి తీసుకుంది. ఇందులో టయోటా వాహనం రత్నగిరి ప్రాంతానికి చెందిన శివసేన నేత విజయ్‌కుమార్ గణ్‌పత్ భోస్లో పేరుమీద ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరొకటి మెర్సిడేజ్ బెంజ్ అని పేర్కొన్నారు. మూడు రోజుల కిందటే ఈ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు, సచిన్ వాజే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై థానే సెషన్స్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.

థానే వ్యాపారవేత్త మన్ ‌సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో సచిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్, ఎన్ ఐఏలు కీలక ఆధారాలు సేకరించాయి. ఫిబ్రవరి 17న హిరేన్ ‌ను సచిన్ కలిసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఒకటి లభించింది. ఫోర్ట్ వద్ద జీపీఓ సమీపంలో ఇద్దరూ కలుసుకుని 10 నిమిషాలు మాట్లాడినట్టు అందులో రికార్డయ్యింది. ములంద్-ఐరోలీ రహదారిపై తన వాహనం మొరాయించడంతో ఓలా క్యాబ్ ‌లో వచ్చినట్టు హిరేన్ గతంలో వెల్లడించాడు. సచిన్ ఫిబ్రవరి 17న తన మెర్సిడేజ్ వాహనంలో ముంబయి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. అక్కడ నుంచి సీఎస్ ఎంటీ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిపి ఉంచారు. గ్రీన్ సిగ్నల్ పడినా వాజే మాత్రం వాహనాన్ని ముందుకు తీసుకెళ్లకుండా పార్కింగ్ లైట్లు ఆన్‌ చేసి నిలబెట్టారు.

ఆ తర్వాత కొద్ది సెకెన్లకే అక్కడకు చేరుకున్న హిరేన్, సచిన్ వాహనంలోకి ఎక్కాడు. తర్వాత జీపీఓ వద్ద ఆ వాహనం పార్క్ చేసినట్టు మరో సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అక్కడే 10 నిమిషాల పాటు వాహనం నిలిపి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హిరేన్ కిందకు దిగి వెళ్లిపోయాడు. అంతకు ముందు ఓలా క్యాబ్‌ ఎక్కిన హిరేన్‌కు మొత్తం ఐదుసార్లు ఫోన్లు వచ్చినట్టు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. తొలుత పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న రూపమ్ షోరూమ్ బయట కలవాలని చెప్పాడు.. కానీ, చివరిసారిగా స్పాట్ మార్చి సీఎస్‌ఎంటీ దగ్గర కలుద్దామని అవతలి వ్యక్తి చెప్పినట్టు వెల్లడించారు. సచిన్ వాజేకు , హిరెన్ కు మధ్య సంబంధాలు ఉండడం, ఈ కేసులో కీలక సాక్షి అయిన హిరెన్ హత్యకు గురికావడంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తుంది.