Begin typing your search above and press return to search.

అంబానీ కేసు: తీహార్ జైల్లో ఉన్న ఆ టెర్రరిస్ట్ కి ఉన్న లింకేంటి ?

By:  Tupaki Desk   |   12 March 2021 6:55 AM GMT
అంబానీ కేసు: తీహార్ జైల్లో ఉన్న ఆ టెర్రరిస్ట్ కి ఉన్న లింకేంటి ?
X
పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్‌ నివాసం యాంటీలియా సమీపంలోనే స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. ఈ వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు తేలింది. అలాగే , ఆ వాహనం లో కొన్ని కార్ల నంబ‌ర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. వాటిలో అంబానీ భ‌ద్ర‌తా సిబ్బంది వినియోగించే కార్ల‌కు సంబంధించిన నంబ‌ర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. అయితే , పోలీసులు ఈ కుట్ర ను భగ్నం చేశారు.

అయితే , ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని జైషుల్ హింద్ టెలీగ్రామ్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు,అంబానీ దంపతుల నుంచి ఆ సంస్థ క్రిప్టోకరెన్సీ కూడా డిమాండ్ చేసింది. దీనితో టెలీగ్రామ్‌లో జైషుల్ హింద్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన ఫోన్ నంబర్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నంబర్‌‌ను తీహార్ జైలుకు సమీపంలో ట్రాక్ చేసినట్లు సైబర్ నిపుణులు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తీహార్ జైల్లోని జైల్ నంబర్ 8లో ఉన్న ఖైదీల వస్తువులను పోలీసులు సోదా చేశారు. ఈ సందర్భంగా తెహసీన్ అక్తర్ అనే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది నుంచి ఒక సెల్‌ ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదే సెల్‌ ఫోన్ నుంచి ఓ యాప్ ద్వారా వర్చువల్ నంబర్స్ ‌ను క్రియేట్ చేసి, వాటి ద్వారా టెలీగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 26న టెలీగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశారని,ఆ మరుసటిరోజే అంబానీ ఇంటి సమీపంలో పేలుడుకు బాధ్యత వహిస్తూ జైషుల్ హింద్ అదే టెలీగ్రామ్ ఖాతాలో ప్రకటన ఇచ్చినట్లు తేల్చారు. తెహసీన్ అక్తర్ వద్ద గుర్తించిన ఆ సిమ్‌ కార్డు తూర్పు ఢిల్లీలోని రఘుబర్ పురాకు చెందిన జయదీప్ లోధియా అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు తేలింది. అయితే అది తెహసీన్ అక్తర్ వద్దకు ఎలా చేరిందన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద తీహార్ జైలు నుంచే అతను సెల్‌ ఫోన్‌‌ ను ఆపరేట్ చేశాడని అంబానీ ఇంటి వద్ద పేలుడుకు సంబంధించిన ప్లాన్‌లో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోదాల సందర్భంగా మొత్తం 11 మంది ఖైదీలను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.