Begin typing your search above and press return to search.

మోడీతో బాబు జోడీ ఫ‌లిత‌మిదే!

By:  Tupaki Desk   |   23 Nov 2016 5:47 AM GMT
మోడీతో బాబు జోడీ ఫ‌లిత‌మిదే!
X
పెద్ద నోట్ల ర‌ద్దు - త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల జోడి దేశాన్ని - రాష్ట్రాన్ని బోడి చేసేసి దెబ్బ తీసిందని అంబ‌టి ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు ఘనత తనదేనని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి అవకాశవాద రాజకీయాలకు ఆద్యుడనని చెప్పకనే చెప్పారన్నారు. హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే..కానీ అమలులో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అంబ‌టి అన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయలేదని త‌ప్పుప‌ట్టారు.

పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో తానే ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి సలహా ఇచ్చానని, లేఖ కూడా రాశానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు - ప్రజల కష్టాలు చూసి మాటమర్చారని అంబ‌టి త‌ప్పుప‌ట్టారు. మంచి జరిగితే తనవల్లే నని, ఏవైనా ఇబ్బందులు వస్తే ముందే చెప్పానని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే హెరిటేజ్‌ సంస్థ షేర్‌ విలువ పెరిగిందని అంబ‌టి ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాకముందు హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.199 ఉంటే, ఇప్పుడు ఒక్కసారిగా రూ.909కి ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు విషయం ముందే తెలియడంతో చంద్ర‌బాబు త‌న‌ అవినీతి డబ్బును హెరిటేజ్‌ లో పెట్టి బ్లాక్‌ ను వైట్‌ చేసుకున్నారని అంబ‌టి ఆరోపించారు.

ఏపీపీసీసీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి సైతం ఇదే రీతిలో స్పందించారు. నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని ఇందులో బీజేపీ మొదటి ముద్దాయి కాగా టీడీపీ రెండో ముద్దాయి అని మండిప‌డ్డారు. రద్దుకు ముందే బీజేపీ - టీడీపీ నేతలకు స‌మాచారం ఉండ‌టం వ‌ల్ల వారి పాత కరెన్సీను మార్చుకున్నారని ఆరోపించారు. అసలు నల్లధనం అంతా విదేశాల్లో ఉందని, కొందరు డాలర్లు - ఆస్తుల రూపంలో కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారని ర‌ఘువీరా అన్నారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో నల్లకుబేరులు యథేచ్చగా తప్పించుకుని దర్జాగా ఉంటే, సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గుంటూరులోని మార్కెట్‌ లో ప్రజలను కలుసుకున్న రఘువీరా రెడ్డి చిన్న నోట్ల కొరత వల్ల ఏర్పడిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు తగ్గిపోయాయని, చిన్న నోట్లు లేక ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు అల్లాడుతున్నారని పలువురు ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం ర‌ఘువీరా విలేకరులతో మాట్లాడుతూ - ప్రజల ఇబ్బందులు తొలగాలంటే తక్షణం రూ.100 నోట్లను విడుదల చేయాలన్నారు. రూ.500 - రూ, 1000 నోట్లు రూ.14 లక్షల కోట్లు దేశంలో ఉన్నాయని - వీటిని రద్దు చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అంతే స్థాయిలో చిన్న నోట్లను ముద్రించకుండా ఉండడం తగదని అన్నారు. రూ.2 వేల నోట్లు ఎక్కువగా విడుదల చేసి కుబేరులను కాపాడి సామాన్యులను వీధుల పాల్జేశారని ర‌ఘువీరా విమర్శించారు. రూ.2 వేల నోట్లు ఎక్కడా చెల్లుబాటు అవ్వక ప్రజలు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండ‌గా ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని కోటీశ్వరులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపి చింతామోహన్‌ విమర్శించారు. చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని రిలయన్స్‌ అంబానీ - మఫత్‌ లాల్‌ వంటి బడా కోటీశ్వరులకు ప్రతినిధిగా ప్ర‌ధాన‌మంత్రి ఉన్నారని మాయావతిని ఓడించేందుకు వేసిన రాజకీయ ఎత్తుగడ అన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేత గాలి జనార్థన్‌ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె పెళ్లి ఎలా చేశారో క‌మ‌ళ‌నాథులు స్పష్టం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో ఈ పాపంలో చంద్రబాబునాయుడూ ఉన్నారని చింతా మోహ‌న్‌ ఆరోపించారు. టీడీపీ నేతలు నోట్ల రద్దును గట్టిగా విమర్శించలేకపోతున్నార‌ని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో కూలీలు - రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/