Begin typing your search above and press return to search.

బాబుకు ఆ గుణం ఎందుకు లేదంటున్న అంబ‌టి

By:  Tupaki Desk   |   17 April 2017 4:41 PM GMT
బాబుకు ఆ గుణం ఎందుకు లేదంటున్న అంబ‌టి
X
ప్రొద్దుటూరు చైర్మన్‌ ఎన్నిక వాయిదా విషయమై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఓడిపోతామనే భయంతో తెలుగుదేశం పార్టీ అలజడులు సృష్టించి, ఫర్నీచర్‌ ధ్వంసం చేసి వాయిదా వేసుకొని పారిపోయిందని ఎద్దేవా చేశారు. గెలవలేమనే దశలో కౌన్సిలర్లను కొనుగోలు చేయడానికి టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి - మంత్రి ఆదినారాయణరెడ్డి ఎన్నో కుట్రలు పన్నారని అంబ‌టి తెలిపారు. ఎన్నిక‌ వాయిదా తరువాత కౌన్సిలర్లుకు డబ్బులు వెదజల్లి - బెదిరింపులకు గురిచేసి ఎలాగైనా చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారని అంబ‌టి మండిప‌డ్డారు. వైఎస్‌ ఆర్‌ సీపీ అభ్యర్థి ముక్తియార్‌ కు చంద్రబాబు - లోకేష్‌ లు ఫోన్‌ చేసి చైర్మన్‌ బరి నుంచి తప్పుకోవాలని డబ్బులు - పదవులు ఆశచూపిస్తున్నారని విమ‌ర్శించారు. ఆయన లొంగకపోవడంతో ఎన్నిక వాయిదా వేసేందుకు యత్నించారన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ మినిట్స్‌ బుక్‌ పట్టుకొని పారిపోయే స్థితికి దిగజారారంటే చంద్రబాబు రాక్షసరూపం బహిర్గతంగా కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ఓటమిని భరించలేని స్థితికి పడిపోయాడని అంబ‌టి పేర్కొన్నారు. రాజ‌కీయాల్లో గెలుపు-ఓట‌ములు స‌హ‌జ‌మనే విష‌యాన్ని 30 ఏళ్ల అనుభ‌వ‌మున్న రాజ‌కీయ వేత్త‌గా చంద్ర‌బాబు తెలుసుకోలేక‌పోవ‌డం ఏమిటని అంబ‌టి ప్ర‌శ్నించారు.

కడపలో దివంగ‌త నే వైస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడు వైఎస్‌ వివేకానందరెడ్డినే ఓడించాం అని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రొద్దుటూరులో ఓడిపోతే తలకాయ ఎక్కడపెట్టుకోవాలో అనే భయం జొరబడింద‌ని అంబ‌టి ఎద్దేవా చేశారు. `ఒక్క మున్సిపాలిటీ ఓడిపోతే నీ ముఖ్యమంత్రి తనం పోతుందా.. లేక లోకేష్ మంత్రిత్వ శాఖలో ఏ శాఖ అయినా ఎగిరిపోతుందా` అని ప్రశ్నించారు. దౌర్జన్యాన్ని, అశాంతిని చంద్రబాబు పాలుపొసి పెంచుతున్నాడని, పాలుపొసి పెంచిన పాము పెంచిన వాడినే కాటేసి చంపిన చందంగా చివరికి అది బాబుకే ముప్పు అవుతుందని సూచించారు. టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యఖాండను పోలీసులు అరికట్టలేకపోయారన్నారు. కనీసం ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. చైర్మన్‌ ఎన్నిక జరిగే వరకు మున్సిపల్‌ హాల్‌ విడిచిపెట్టి వెళ్లకూడదని వైఎస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లు అక్కడే కూర్చున్నారని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వారిపై దౌర్జన్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వాయిదా పడితే తిమ్మిన బ‌మ్మిని చేసి కౌన్సిలర్లను కొనుగోలు చేద్దామని కుట్రపూరితమైన ఆలోచనలో ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్‌ కలగజేసుకొని కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని అంబ‌టి కోరారు.

తెలుగుదేశం పార్టీ అభ‌ద్ర‌త‌భావం తారాస్థాయికి చేరింద‌ని అంబ‌టి మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తోసే ధోరణి ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే దానిపై కూడా ప్రతిపక్ష హస్తం ఉందని బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఎంపీ శివప్రసాద్‌ వాస్తవాలు మాట్లాడారని అంబటి స్పష్టం చేశారు. ఎస్సీలకు మంత్రి పదవుల కేటాయింపులో జాప్యం జరిగిందని, దళితుల పట్ల చంద్రబాబు రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారనే రీతిలో శివప్రసాద్‌ చెప్పారన్నారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితుల హృదయాలను గెలుచుకోలేవని చంద్రబాబు సూచించారు. మీ సొంత జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇస్తుంటే సిగ్గులేదా అని చంద్రబాబును నిలదీశారు. దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నాడని, చంద్రబాబు దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అంబటి ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/