Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి : ఇప్ప‌టికైనా ఆ..బాధ్య‌త జ‌గ‌న్ తీసుకుంటారా ?

By:  Tupaki Desk   |   4 Jun 2022 5:43 AM GMT
అమ‌రావ‌తి : ఇప్ప‌టికైనా ఆ..బాధ్య‌త జ‌గ‌న్ తీసుకుంటారా ?
X
అమ‌రావ‌తిని ఉద్దేశించి మంత్రి బొత్స. ఇక్క‌డేముంది స్మ‌శానం త‌ప్ప అని అన్నారు.. ఆ మాట త‌ప్పు అని త‌రువాత వైసీపీ నాయ‌కులే ఒప్పుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ కీల‌క నాయ‌కురాలు కూడా అలా అన‌డం త‌ప్పే అని చెప్పారు. అది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం కింద చూసేందుకు కూడా వీల్లేద‌ని చాలా మంది వైసీపీ శ్రేణులు అంత‌ర్మ‌థ‌నం చెందాయి.

ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి ఇంకా చెప్పాలంటే రాజ‌ధాని రైతుల ఉద్య‌మానికి 900 రోజులు పూర్త‌వుతున్నాయి. ఇప్ప‌టికీ రాజ‌ధాని నిర్మాణంపై ఎటువంటి స్ప‌ష్ట‌తా లేకుండా పోయింది. అయినా కూడా న్యాయ పోరాటం మాత్రం ఆపేదే లేద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఉంద‌ని వీరంతా ముక్త‌కంఠంతో అంటున్నారు. ఈ ద‌శ‌లో ఉద్య‌మం ఎటు నుంచి ఎటు వైపు?

ఉద్య‌మానికి సంబంధించి కూడా ఎవ‌రు ఎదుగుతున్నారు. ఎవ‌రు త‌మ ప‌రువును కోల్పోయే విధంగా మాట్లాడుతున్నారు అన్న‌ది కూడా తెలుసుకోవాల‌ని రాజ‌ధాని రైతులు హిత‌వు చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ చ‌ద‌రంగంలో తాము పావులు కాబోమ‌ని, ఎలా అయినా తమ హ‌క్కులు సీఆర్డీఏ ద్వారా సాధించుకుంటామ‌ని, వెంట‌నే నిర్మాణాలు చేప‌ట్టి, అభివృద్ధి చేసిన నేల‌లో మా వాటా మాకు ఇవ్వాల‌ని అంటున్నారు నాటి ఒప్పందంలో పాల్గొన్న రైతులు.

ఇది ప్ర‌భుత్వంతో చేసుకున్న ఒప్పందం. దీనికి లీగ‌ల్టీ (legality) అన‌గా చ‌ట్ట బ‌ద్ధత ఉంటుంది..కానీ ఆ విధంగా కాకుండా ప్ర‌భుత్వ ఏకప‌క్షంతో వెళ్తే మ‌రో సారి మ‌రో రూపంలో ఉద్య‌మానికి నాంది ప‌ల‌కుతాం..అని చెబుతున్నారు సంబంధిత రైతులు. 3 పంట‌లు పండే నేల‌కు త‌ర్ప‌ణం ఇచ్చి ఇప్పుడు తాము అటు పంట‌లు పండించుకోలేక, ఇటు భూములు ద‌క్కించుకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని అంటూ క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు.

ఇటీవ‌ల వెలువ‌డిన ఓ తీర్పు ప్ర‌కారం ఓ సారి ప్ర‌భుత్వ అవ‌స‌రాల మేర‌కు భూములు వెన‌క్కు ఇవ్వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని అని కోర్టు తేల్చేసింది. మ‌రి ! రాజ‌ధాని రైతుల‌కూ ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది క‌నుక ఇప్పుడు వీరంతా డైలామాలో ఉన్నారు.

ఈ నేప‌థ్యాన జ‌గ‌న్ చొర‌వ చూపిస్తే నిర్మాణాలు కాస్తో కూస్తో చేప‌ట్ట‌గ‌లిగే విధంగా ఆర్థిక వ‌న‌రులు కేంద్రాన్ని ఒప్పించి అయినా మ‌రిన్ని స‌మ‌కూర్చుకోగ‌లిగితే, ఆ విధంగా నిధులు తెచ్చుకోగ‌లిగితే (ఆల్రెడీ మొన్న‌టి వేళ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి విడుద‌ల చేశారు) రాజ‌ధాని రైతు కాస్త‌యిన ఊర‌ట చెందుతాడు. లేదంటే సమ‌స్యలు అన్న‌వి ఈ విధంగానే మ‌రో 1000 రోజులు అయినా అప‌రిష్కృత రీతిలోనే ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.