Begin typing your search above and press return to search.

బెదిరింపులతో వసూలు చేసిన డబ్బులతో ఆ ఫేమస్ నటికి గిఫ్టుగా ఖరీదైన కారు

By:  Tupaki Desk   |   24 Oct 2021 5:32 AM GMT
బెదిరింపులతో వసూలు చేసిన డబ్బులతో ఆ ఫేమస్ నటికి గిఫ్టుగా ఖరీదైన కారు
X
ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఆర్థిక నేరాలతో పాటు బెదిరింపు.. బ్లాక్ మెయిల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్. ఒక పాత కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇతగాడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త భార్యను బెదిరించి రూ.200 కోట్లు కొల్లగొట్టిన కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు నడుస్తోంది. ఈ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌతిండియాకు చెందిన లీనా మారియా పాల్ అనే నటిని కొంతకాలం క్రితం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో పలు సంచలన అంశాల్ని వెల్లడిస్తున్నాడు సుఖేశ్.

తాజాగా అతడి నోటి నుంచి వస్తున్న కొత్త విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం.. బాలీవుడ్ ప్రముఖ తారల పేర్లు తెర మీదకు రావటమే. స్టార్ హీరోయిన్లుగా పేరున్న నోరా ఫతేహి.. జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేర్లు సుఖేశ్ నోటి నుంచి రావటం.. అనంతరం వారిని సాక్ష్యులుగానే ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా వారి ప్రమేయం కేసులో పెరిగిపోతుండటంతో మరింత లోతుల్లోకి వెళుతున్న పరిస్థితి. ఇందులో భాగంగా సాగుతున్న విచారణకు నోరా ఫతేహి ఇప్పటికే మూడుసార్లు అధికారుల విచారణకు హాజరు కాగా.. మరో స్టార్ నటి జాక్విలిన్ మాత్రం నోటీసులకు స్పందించటం లేదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈడీ విచారణలో తాజాగా సుఖేశ్ మరింత సంచలన అంశాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అతని స్టేట్ మెంట్ ప్రకారం.. నోరా ఫతేహికి తాను ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీలోని ఒక వ్యాపారి భార్యను బెదిరించటం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే ఈ కారును గిఫ్టుగా ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. నోరా ఫతేహి సెక్రటరీ మాత్రం కారు బహుమానం అనే మాట అబద్ధమని చెబుతున్నారు. కొత్త మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో నోరా ఫతేహి.. జాక్విలిన్ లను ఏ దరికి చేరుస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.