Begin typing your search above and press return to search.

ఆనం స‌వాల్‌!... బాబుకు ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   25 Jan 2019 11:20 AM GMT
ఆనం స‌వాల్‌!... బాబుకు ద‌మ్ముందా?
X
ఏపీ అసెంబ్లీకి మ‌రో మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీల‌తో పాటు ఇత‌ర‌త్రా చిన్నా చితక పార్టీలు కూడా ఎన్నిక‌ల సన్నాహాల్లో మునిగిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే లెక్క‌లేనన్ని స‌ర్వేలు వ‌చ్చాయి. దాదాపుగా అన్ని స‌ర్వేల్లోనూ వైసీపీనే విజ‌యం వ‌రించ‌నుంద‌న్న ఫ‌లితం వ‌చ్చేసింది. టీడీపీ అనుకూల మీడియా చేసిన స‌ర్వేలు మాత్రం మ‌రోమారు చంద్ర‌బాబుదే అధికారమంటూ చెప్పేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎన్నిక‌ల‌కు ధైర్యంగా వెళ్లే అవ‌కాశం ఎవ‌రికి ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యంపై మాట్లాడేందుకు వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రామనారాయ‌ణ రెడ్డి కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చారు. ఐదేళ్ల అవినీతి పాల‌న‌లో నోట్ల మూట‌లు వెన‌కేసుకున్న చంద్ర‌బాబుకు ధ‌న బ‌లం ఉంటే... త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి జ‌న బ‌లం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న బ‌లం మెండుగా ఉన్న జ‌గ‌న్ చేతిలో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భావ‌న‌కు వ‌చ్చేసిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి కార‌ణాలు వెతుక్కునే ప‌నిలో ప‌డ్డార‌ని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంల మీద సాకులు చెప్పడానికి టీడీపీ ఇప్పుడే ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఐటీ, సీబీఐ అంటే సీఎం చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని ప్ర‌శ్నించిన ఆనం... అసలు ఆయన బాధ ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా నిజాయితీ ఉంటే తన పాలన మీద రెఫరెండానికి సిద్ధ‌మా అని ఆనం స‌వాల్ విసిరారు. 40 సంవత్సరాల అనుభవంతో కొత్త హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా అంటే.. అది కూడా చెప్పలేని స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు.

ధనబలంతో రాష్ట్ర ప్రజలని వంచించే ప్రయత్నం చేస్తూ... డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చెక్కుల పంపిణీ చేస్తున్నారంటూ ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల ఉపఎన్నికలో రూ.200 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ.. ఇప్పుడు కత్తిరింపు సర్వేతో దగా చేయడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతూ... సీఎం అంటే కాపీ మినిస్టర్‌గా మారారని ఆనం ఎద్దేవా చేశారు. టీడీపీ వేసేది మ్యానిఫెస్టో కమిటీ కాదు.. మ్యానిపులేషన్‌ కమిటీ అని ఆయ‌న ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణ అంటే బాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ కుట్రలో లోకేష్ పాత్ర లేకపోతే... డీజీపీతో లోపాయకారి ఒప్పదం చేసుకోకపోతే ఎన్‌ఐఏను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆనం ప్రశ్నించారు.