Begin typing your search above and press return to search.

బాబుకు షాక్‌..వైసీపీలోకి చేరేందుకు ఆనం రెడీ

By:  Tupaki Desk   |   3 May 2018 2:47 PM GMT
బాబుకు షాక్‌..వైసీపీలోకి చేరేందుకు ఆనం రెడీ
X
ఆనం బ్రదర్స్‌... నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ కు 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు కేరాఫ్‌ అడ్రస్‌ వారే. అయితే ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన త‌ర్వాత ఆ ఇద్ద‌రు నేత‌లు రాజ‌కీయ చౌర‌స్తాలో నిల‌బ‌డ్డారు. ఏ పార్టీలోకి వెళ్దామ‌ని చూసినా...ఏదో అడ్డంకి వ‌స్తుండ‌టంతో..ఏం చేయాలో అర్థం కాక‌...ఎటువెళ్లాలో స్ప‌ష్ట‌త లేక గంద‌ర‌గోళంలో చిక్కుకున్నారు. అనంత‌రం ఎట్ట‌కేల‌కు అధికార టీడీపీలో చేరారు. అయితే వారికి ప‌ద‌వి ప‌రంగా న్యాయం జ‌ర‌గ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఆనం వివేకానంద రెడ్డి మ‌ర‌ణంతో ఆనం కుటుంబానికి సంబంధించి కొత్త వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.

నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులు.. ఆనం రామనారాయణరెడ్డి - ఆనం వివేకానందరెడ్డిలకు మంచి పేరు ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో ఆనం వివేకా మరణించారు. వివేక మరణించినప్పుడు పరామర్శకు వచ్చిన చంద్రబాబు.. రామనారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి చర్చ జరపలేదు. కనీసం భరోసాను కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు కార్యకర్తల నుంచి వైసీపీలో చేరాలని ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప‌ద‌వి కోసం నిరీక్ష‌ణ‌లో ఉండ‌టం, పైగా త‌మ‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఏది ద‌క్క‌క‌పోవ‌డంతో ఆనం ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది.

కాగా, ఆనం కుటంబానికి స‌న్నిహితుడైన వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో చ‌ర్చ‌లు జ‌రిపి పార్టీలో చేరే విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. బొత్స కొద్దికాలం క్రితం వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే వైసీపీలోకి వచ్చేయాల్సిందిగా ఆనం రామనారాయణరెడ్డికి బొత్స ఆఫర్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఆనం ఫ్యామిలీ చేరికపై పలుమార్లు చర్చలు కూడా జరిగాయని టాక్‌. అయితే అప్పుడు ఆనం సోద‌రులు ఆగిపోయారు. అయితే తాజ‌గా వైసీపీ పుంజుకుంటుండ‌టం, టీడీపీ త‌మ‌కు త‌గిన న్యాయం చేయ‌ని నేప‌థ్యంలో..ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీకి జై కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు.