Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ నుంచి ఏపీ ఆస్తుల‌న్నీ త‌ర‌లించేశారు

By:  Tupaki Desk   |   13 July 2017 4:31 AM GMT
హైద‌రాబాద్ నుంచి ఏపీ ఆస్తుల‌న్నీ త‌ర‌లించేశారు
X
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి ఏపీ స‌చివాల‌యానికి సంబంధించి ఆస్తుల‌న్నీ ప్యాక‌ప్ అయిపోయాయి. అదేంటి గ‌త ఏడాదే త‌ర‌లించేశారు క‌దా? అమ‌రావ‌తిలోని తాత్కాలిక స‌చివాల‌యం నుంచి ప‌రిపాల‌న కూడా బేషుగ్గా సాగిపోతోంది క‌దా అనుకుంటున్నారా!. మీ అభిప్రాయం నిజ‌మే అయితే....హైదరాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని కావ‌డం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఏపీ సెక్రటేరియట్లో కొన్ని బ్లాక్‌ ల‌లో అవ‌స‌ర‌మైన విలువైన ఆస్తులు ఉంచారు. కీల‌క‌మైన ఎల్ బ్లాక్ లో ముఖ్య‌మంత్రి - రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సంబంధించిన వ‌స్తువుల‌ను ఇన్నాళ్లు ఏపీ స‌ర్కారు త‌ర‌లించలేదు.

అయితే తాజాగా హైద‌రాబాద్‌ లోని ఏపీ స‌చివాల‌యం నుంచి అమరావతికి విలువైన వస్తువులు బుధ‌వారం రాత్రివేళలో త‌ర‌లించేశారు. ఏడవ అంతస్తులోని సీఎం చాంబర్ - సీఎస్ చాంబర్ - కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎలక్ట్రానిక్స్ ప‌రిక‌రాలు - ఫర్నీచర్ తరలింపు తాజాగా చేశారు. రూ. కోటికి పైగా విలువచేసే మైక్ సెట్ - పెద్ద పెద్ద ఎల్ ఈడీలు - ఏసీలు - సోఫాసెట్లు కుర్చీలు వంటివి మెత్తంగా దాదాపు ఐదుకోట్ల విలువచేసే సామాగ్రిని నాలుగు లారీల తరలింపు ఏర్పాట్లు చేశారు. త‌ద్వారా ఉమ్మ‌డి రాజ‌ధానిలోని స‌చివాల‌యం నుంచి ఏపీకి చెందిన అస్తిత్వాల‌న్నింటినీ దాదాపుగా త‌ర‌లించిన‌ట్ల‌యింది.

ఇదిలాఉండ‌గా...ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలో ఉద్యోగులంతా అమరావతికి గ‌త ఏడాదే త‌ర‌లివెళ్లిన సంగ‌తి తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు ఆదేశానుసారం సుమారు ఉద్యోగులు తాత్క‌లిక ప‌రిపాల‌న‌లో భాగంగా విజయవాడ - గుంటూరు నగరాల్లో 60 వరకూ హెచ్‌ ఓడి కార్యాలయాలు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కార్యాలయాల ఏర్పాటు కోసం సుమారు 50 నుంచి 60 భవనాలను అద్దెకు తీసుకున్నారు. అనంత‌రం అమ‌రావ‌తిలో నిర్మాణ‌మైన తాత్కాలిక స‌చివాల‌యం నుంచి ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.