Begin typing your search above and press return to search.

బాబు ప్లానింగ్.. టైమింగ్‌ తో మిత్రులు ఉక్కిరిబిక్కిరి!

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:46 AM GMT
బాబు ప్లానింగ్.. టైమింగ్‌ తో మిత్రులు ఉక్కిరిబిక్కిరి!
X
సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఎత్తుప‌ల్లాల్ని చూసి.. రాటుతేలిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వేస్తున్న ఎత్తులు మిత్రుల‌కు ముచ్చ‌మ‌ట‌లు పోయిస్తున్నాయి. స‌మ‌కాలీన రాజ‌కీయ నేత‌ల మాదిరి ఊరికే నోరు జార‌టం లాంటి త‌ప్పుల్ని అస్స‌లు చేయ‌ని చంద్ర‌బాబు.. ఎప్పుడేం చేయాలో చేసుకుంటూ పోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. ఇటీవ‌ల కాలంలో త‌న మీద‌కు వ‌స్తున్న స‌మ‌స్య‌ల్ని తెలివిగా ఒడిసి ప‌ట్టి కేంద్రం కోర్టులోకి మ‌ళ్లించ‌టం ద్వారా.. దిమ్మ తిరిగేలా చేస్తున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌న‌ను ఇరుకున పెట్టేందుకు కేంద్రం పావులు క‌దుపుతున్న వేళ‌.. ఆ విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు తెలివిగా.. బంతిని కేంద్రంకోర్టులో వేసి కామ్ గా ఉండిపోయారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన స్పిల్ వే.. స్పిల్ చానెల్ ప‌నుల‌కు పిలిచిన టెండ‌ర్ల‌ను నిలిపివేయాల‌ని కేంద్రం నుంచి వ‌చ్చిన లేఖ గోడ‌కు కొట్టిన బంతిలా తిరిగి కేంద్రానికే త‌గిలేలా చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు.

స‌కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని చెబితే.. రోజు వ్య‌వ‌ధిలో అప్ప‌గిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఈ ఇష్యూలో త‌న త‌ప్పు లేద‌న్న భావ‌న‌ను క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. త‌ర‌చూ లేఖ‌ల‌తో ఇబ్బంది పెడుతున్న కేంద్రం తీరుపై ఆయ‌న చిరాకును ప్ర‌ద‌ర్శించారు. నిత్యం సంయ‌మ‌నంతో ఉండే చంద్ర‌బాబు నోట అస‌హ‌నం వ్య‌క్తం కావ‌టం పెద్ద విష‌య‌మే. అది చేరాల్సిన తీరులో కేంద్రానికి చేరిపోయింది.

చంద్రబాబు నోటి నుంచి ప్రాజెక్టు విష‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం కావ‌టం.. విప‌క్షాలు సైతం కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్ట‌టంతో.. ఈ విష‌యంలో తాము బుక్ కానున్నామ‌న్న విష‌యం ఢిల్లీ పెద్ద‌ల‌కు అర్థ‌మైంది. బాబు పుణ్య‌మా అని డిఫెన్స్ లో ప‌డిన మోడీ స‌ర్కారు చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాన్ని షురూ చేసింది. కేంద్ర‌మంత్రిని రాయ‌బారానికి పంపి.. ఇష్యూను క్లోజ్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఈ వ్య‌వ‌హారంలో ఏపీ బీజేపీ నేత‌ల పాత్ర నామ‌మాత్రం కావ‌టం.. బీజేపీ అధినాయ‌క‌త్వం త‌మ‌పై కాకుండా బాబుతోనే నేరుగా చ‌ర్చ‌ల‌కు దిగ‌టం.. ఏపీ క‌మ‌ల‌నాథుల‌కు కోపాన్ని క‌లిగించింది. అలా అని త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని బ‌య‌ట‌పెట్టుకోని నేప‌థ్యంలో బాబు త‌మ‌ను తెలివిగా దెబ్బ కొడుతున్నార‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

పోల‌వ‌రం ఇష్యూలోనే కాదు.. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలోనూ బాబు స‌ర్కారు తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అసంతృప్తిని ఏపీ బీజేపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో 5 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించ‌ట‌మే కాదు.. ఎఫ్ కేట‌గిరిని కొత్త‌గా ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా తీర్మానించింది.

గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర ప‌డిన త‌ర్వాత కేంద్రానికి వెళ్ల‌నుంది. దీంతో.. కాపు రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ప‌డేలా చేశారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తాను చేయాల్సిన ప‌నిని తాను చేసేశాన‌ని.. ఇక అమ‌లు బాధ్య‌త కేంద్రం మీద‌నేనంటూ ముగ్గులోకి మోడీ స‌ర్కారును లాగారు. ఇలా ఒకదాని త‌ర్వాత మ‌రొక‌టి అన్న చందంగా ఏపీ ఇష్యూల‌ను కేంద్రం మీద ప‌డేయ‌టం ద్వారా కేంద్ర స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనంపై ఏపీ బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మిత్రుల మ‌ధ్య మొద‌లైన క‌స్సుబుస్సులు ఎంత‌వ‌ర‌కు వెళ‌తాయో చూడాలి.