Begin typing your search above and press return to search.

మారలేదు.. మళ్లీ మళ్లీ అవే మాయమాటలు!

By:  Tupaki Desk   |   8 Feb 2018 9:32 AM GMT
మారలేదు.. మళ్లీ మళ్లీ అవే మాయమాటలు!
X
‘‘చేస్తాం చూస్తాం అంటే కుదరదు’’ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గానీ, అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ.. ప్రధాని ప్రసంగం తర్వాత కూడా చెబుతున్న మాట ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలందరూ నిరాటంకంగా నిరసనలు వెలిబుచ్చుతున్నప్పటికీ.. పాలక భాజపాలో మాత్రం అణువంతైనా మార్పు కనిపించడం లేదు. కేంద్రం మొండి పట్టుదల వల్ల ఏర్పడుతున్న ప్రతిష్టంభన ను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. కేంద్రంలోని పెద్దలు, ఎప్పటిలాగానే అవే మాయమాటలు చెబుతూ.. మేం చెబుతున్నాం గనుక.. మీరు నమ్మి.. ఊరుకోవాల్సిందే.. అన్నట్లుగా మొండిగా వ్యవహరించడం గమనార్హం.

ఏపీకి చెందిన భాజాపా ఎంపీలు కంభంపాటి హరిబాబు - గోకరాజు గంగరాజు - వారితో పాటూ ఏపీ వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ లు కలిసి ప్రస్తుత పరిణామాలను ఒక గాడికి తేవడానిక ప్రయత్నించారు. వారు పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపుల విషయం చర్చించేందుకు మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నిరసనలు తగ్గాలంటే.. కేంద్రంనుంచి ఏదో ఒకటి స్పష్టమైన కేటాయింపుల మాట వచ్చేలా ప్రకటన చేయాలని వారు కోరారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, దానికి తోడు రాష్ట్రంలో తాము తప్ప అన్ని పార్టీలు చేస్తున్న నిరసనల వల్ల తాము రాష్ట్రంలో తలెత్తుకుని తిరగలేని వాతావరణం ఏర్పడిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దిష్టంగా కేటాయింపుల ప్రకటన ఇస్తే తప్ప.. పార్టీ పరిస్థితి కూడా కష్టమే అనే సంగతిని సూచన ప్రాయంగా చెప్పారు.

ఎన్ని చెప్పినప్పటికీ.. నితిన్ గడ్కరీ వైఖరిలో మాత్రం ఏమాత్రం మెత్తబడడం జరగలేదు. 2019 నాటికి మేం పోలవరం పూర్తిచేస్తాం.. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా అనే పాత పాచిపోయిన పాటనే ఆయన మళ్లీ వినిపించారు. ఈ బడ్జెట్ లో ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా.. పనులు ఎలా చేయగలరు.. ఏ యాక్షన్ ప్లాన్ తో ఈ మాట చెబుతున్నారు... లాంటి వివరాల జోలికి ఆయన వెళ్లలేదు. తాను చెప్పేది ఇదొక్కటే మాట... దీన్ని నమ్మి.. అందరూ శాంతించాలన్నట్లుగా వ్యవహరించారు. నిజానికి మాట నిలకడ ఉన్న ప్రభుత్వంగా మోడీ సర్కార్ క్రెడిబిలిటీ కోల్పోయినందువల్లే.. ఇంత రభస జరుగుతున్నదని గడ్కరీ మరచిపోయినట్లుంది.