Begin typing your search above and press return to search.

ఢిల్లీ నేతపై కమలదళంలో అసంతృప్తి సెగలు

By:  Tupaki Desk   |   4 Oct 2017 4:17 AM GMT
ఢిల్లీ నేతపై కమలదళంలో అసంతృప్తి సెగలు
X
చంద్రబాబునాయుడుతో కలిసి వేదికను పంచుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించడానికి మాత్రం సమయం ఉంటుందా... రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కీలకంగా ఉండగా... అందుకోసం ఎన్నాళ్ల ముందునుంచో ప్లాన్ చేసి నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొనడానికి మాత్రం సమయం ఉండదా?... ఇలా వివక్ష చూపిస్తూ అసలు పార్టీ బాగుపడేది ఎలాగ...? ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భాజపాలో సాగుతున్న అంతర్గత మధనం. ఒకవైపు తెలుగుదేశానికి ధీటుగా తమ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న నాయకులకు హస్తిన నాయకుల తీరు మాత్రం మింగుడు పడడం లేదు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం విజయవాడకు వచ్చారు. ఆయన గతంలో పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన వ్యక్తి. ఏపీలో పార్టీ విస్తరణ గురించి గతంలోనూ పలుమార్లు మాటలు వెల్లడించిన వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో- పార్టీకి స్ఫూర్తి ఇవ్వడానికి ఒక పదాధికారుల సమావేశం నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని కీలక నాయకులంతా విజయవాడకు చేరుకున్నారు. అయితే అనుకున్నట్లుగా పదాధికారుల సమావేశం మాత్రం జరగలేదు.

నితిన్ గడ్కరీ.. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన శంకుస్థపానలు - ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును కూడా సందర్శించారు. అయితే సభ ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ప్రకారం.. పార్టీ వర్గాలకు ఇది చాలా నిరుత్సాహం కలిగించింది. అసలే పార్టీ రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కు వేసే చందంగా సాగుతోంది. పార్టీ విస్తరణ గురించి హస్తిన నేతలు కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే ఎలా అని వారు మధన పడుతున్నారు. ఢిల్లీనేతలు వచ్చినప్పుడైనా అంతో ఇంతో పార్టీ సమావేశాలు నిర్వహించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటే బాగుంటుందని... రాష్ట్ర పార్టీలోని కొందరు నాయకులు తెలుగుదేశం అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లే.. ఢిల్లీ పెద్దలు కూడా తమ పార్టీని పట్టించుకోకుండా తెదేపా కోసమే పనిచేస్తున్నట్లుగా వచ్చి వెళుతున్నారని విసుర్లు వినిపిస్తునాయి. మరి హస్తిన కమలనాధులు ఇలాంటి అభ్యంతరాలను పట్టించుకుంటారో లేదో?