Begin typing your search above and press return to search.

మోడీషాల‌కే వార్నింగ్ ఇచ్చేసిన క‌మ‌ల‌నాథులు

By:  Tupaki Desk   |   14 May 2018 6:52 AM GMT
మోడీషాల‌కే వార్నింగ్ ఇచ్చేసిన క‌మ‌ల‌నాథులు
X
యావ‌త్ దేశం మొత్తంలో మోడీషాల‌కు అల్టిమేటం ఇచ్చే బీజేపీ నేత‌లు ఎవ‌రైనా ఉంటారా? అంటే.. లేరంటే లేర‌ని చెప్పేస్తారు. ఇక‌పై.. అలాంటి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న ఏపీ బీజేపీ నేత‌లు. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఎంపిక చేస్తూ అధికారికంగా లేఖ విడుద‌ల చేయ‌టం తెలిసిందే.

దీనిపై పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. ఇప్ప‌టికే వీర్రాజు మ‌ద్ద‌తుదారులు పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు ఇచ్చేశారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు మాల‌కొండ‌య్య గ‌ళం విప్పారు. పార్టీకి సేవ చేసిన వీర్రాజును మ‌రిచిపోయి.. వేరే వారికి పార్టీ ప‌గ్గాలు ఇస్తారా? అంటూ మండిప‌డుతున్నారు.

ద‌శాబ్దాలుగా పార్టీలో క‌ష్ట‌ప‌డుతున్న నేత‌ను మ‌రిపోయి.. నిన్న కాక మొన్న వ‌చ్చి జ‌గ‌న్ పార్టీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన క‌న్నాను అధ్య‌క్షుడిగా చేస్తారా? ఇంత‌కు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? అంటూ ఫైర్ అయిన తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు.. సోమ‌వారం సాయంత్రం లోపు వీర్రాజును ఎంపిక చేస్తున్న‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని.. లేనిప‌క్షంలో పార్టీ నేత‌లంతా క‌లిసి రాజీనామా చేస్తార‌ని హెచ్చ‌రించారు. శుభ‌మా అని పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌చ్చినందుకు సంతోష‌ప‌డాలో.. ఇంత తీవ్ర‌స్థాయిలో త‌న‌పై విరుచుకుప‌డుతున్న నేత‌ల తీరుకు క‌న్నా బాధ ప‌డాలో అర్థం కాని ప‌రిస్థితి. మొత్తంగా చూస్తే.. క‌న్నా ఎంపిక ఏపీ బీజేపీలో అసంతృప్తి జ్వాల‌లు ఎగిసిప‌డేలా చేయ‌ట‌మే కాదు.. అధినాయ‌క‌త్వంపై ధిక్కార స్వ‌రాన్ని వినిపించేందుకు సైతం వెనుకాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.