Begin typing your search above and press return to search.

పవన్ మాటల్ని ఏపీ సర్కారు పట్టించుకోనట్లే

By:  Tupaki Desk   |   20 Aug 2015 5:06 AM GMT
పవన్ మాటల్ని ఏపీ సర్కారు పట్టించుకోనట్లే
X
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో భూసమీకరణకు అక్కడి ప్రజలు సిద్ధంగా లేకపోవటం.. దాదాపు 3850 ఎకరాల భూమి విషయంలో సాగుతున్న కసరత్తుకు సంబంధించి ఏపీ సర్కారు భూసేకరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది.

ఒకవైపు.. భూసమీకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ.. రైతులకు ఇష్టం లేకుండా భూసమీకరణ చేపట్టవద్దని చెప్పినా ప్రభుత్వం ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోనట్లుగా కనిపిస్తోంది. గత వారం వ్యవధిలో పలుమార్లు రాజధాని ప్రాంతంలో భూసేకరణ విషయంలో పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాధ్యమంగా ట్వీట్స్ చేయటం తెలిసిందే. బుధవారం అయితే పలు ధఫాలు ఆయన భూసేకరణకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేయటంతో పాటు.. భూసేకరణ వద్దంటూ పలు గ్రామాల పేర్లను ప్రస్తావించారు కూడా.

అభివృద్ధి కోసం పర్యావరణాన్ని..నష్టాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలన్న పవన్ మాటలపై..ఏపీ ఆర్థిక మంత్రి కౌంటర్ ఇస్తూ.. ప్యాకేజీ అడగాలే కానీ.. భూసేకరణ వద్దంటే ఎలా కుదురుతుందని.. భూసేకరణ వద్దంటున్న వారు.. ఏం చేయాలో కూడా చెప్పాలంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజధానిలోని భూములు సేకరించాల్సిన ప్రాంతాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.

రాజధాని కోసం మొత్తం 53,749 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందుకు గాను 29 గ్రామాల్ని గుర్తించటం తెలిసిందే. వీటిల్లో 38,957 ఎకరాలు ప్రైవేటు వారికి సంబంధించినవి కాగా.. 14,794 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. ప్రైవేటు వారికి సంబంధించిన దానిలో ఇప్పటివరకూ 32 వేల ఎకరాల్ని భూసమీకరణ ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం అనుమతులు తీసుకుంది.

ఇప్పుడు పంచాయితీ మొత్తం 3850 ఎకరాలకు సంబంధించినవి. తమ భూముల్ని ఇచ్చేందుకు రైతులు సిద్దంగా లేకపోవటం.. అలాంటి వారిని వదిలేయాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి మొత్తాన్ని సేకరించని పక్షంలో.. ప్లాన్ ప్రకారం ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో.. భూసేకరణ చట్టం ద్వారా.. మిగిలిన 3850 ఎకరాల్ని రైతుల వద్ద నుంచి సేకరించేందుకు ఏపీసర్కారు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రకటనను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ మాటల్ని ఏపీ సర్కారు పట్టించుకున్నట్లుగా కనిపించటం లేదు. మొత్తంగా భూసేకరణకే ఏపీ సర్కారు సిద్ధమైంది. మరి.. ఇదెలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.