Begin typing your search above and press return to search.

బీజేపీ ఏమి సాధిస్తుంది ?

By:  Tupaki Desk   |   5 Aug 2022 6:48 AM GMT
బీజేపీ ఏమి సాధిస్తుంది ?
X
అమరావతి నిర్మాణంపై ఏపీ బీజేపీ నేతల పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా కమలనాథులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలానే మాట్లాడారు. ఇదే సమయంలో అమరావతికి మద్దతుగా తమ వాణిని గట్టిగా వినిపించారు.

అంతాబాగానే ఉంది బీజేపీ పాదయాత్ర చేసి ఏమి సాధించింది ? ఏమి సాధించబోతోంది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే రాజధానుల నిర్మాణం లేదా రాజధాని మార్పన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పేసింది.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులతో కేంద్రానికి ఎలాంటి ప్రమేయం లేదని స్వయంగా హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనే తేల్చిచెప్పింది. కాకపోతే కర్నూలుకు హైకోర్టు తరలింపు అన్నది హైకోర్టు, సుప్రీంకోర్టు ఆమోదంతో ముడిపడిన విషయం. కాబట్టి హైకోర్టు తరలింపును హైకోర్టుతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని ఈమధ్యనే కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండేవుంటుంది.

రాజధానుల విషయంలో తమ ప్రమేయం లేదని ఒకవైపు కేంద్రం తేల్చి చెబుతుంటే మధ్యలో ఏపీ బీజేపీ నేతల పాదయాత్రేమిటో అర్ధం కావటంలేదు. బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చినపుడు తామిష్టం వచ్చినట్లుగా నిర్మించుకోవచ్చంతే. అప్పటివరకు వాళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా ఎంత గోలచేసినా జరిగేదేమీ ఉండదు.

ఇలాంటి పాదయాత్రలు, సమావేశాలు ఎన్నిపెట్టుకున్నా బీజేపీకి పదిఓట్లు కూడా రావు. ఎందుకంటే తాజా సమావేశంలో మాట్లాడిన సత్యకుమార్, సుజనాచౌదరి, సోము వీర్రాజు, కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళ వల్ల పార్టీకి వాళ్ళ నియోజకవర్గాల్లో వంద ఓట్లు కూడా రావు.

ఇలాంటి అనవసర కార్యక్రమాలతో కాలక్షేపం చేసే కన్నా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫైళ్ళను కేంద్రంతో మాట్లాడి క్లియరెన్సు ఇప్పిస్తే చాలా మంచిది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవటం లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడితే జనాలు కూడా సంతోషిస్తారు. పోటీచేసిన ఉపఎన్నికల్లో ఎక్కడ కూడా కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో ఆలోచించుకుంటే అదే పార్టీకి వీళ్ళుచేసే మేలు.