Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ న్యూఇయర్ గిఫ్టు.. కేజీ ఉల్లి రూ.15

By:  Tupaki Desk   |   1 Jan 2020 4:55 AM GMT
జగన్ సర్కార్ న్యూఇయర్ గిఫ్టు.. కేజీ ఉల్లి రూ.15
X
కొత్త సంవత్సరం వేళ ఊహించని రీతిలో వ్యవహరించింది ఏపీలోని జగన్ సర్కారు. తాజాగా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏపీ ప్రజలకు సంతోషాన్ని ఇవ్వటమే కాదు.. న్యూఇయర్ వేళ అందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా గిఫ్టు ఇవ్వాలని నిర్ణయించింది.

అంతకంతకూ పెరిగిపోతున్న ఉల్లి ధరలకు చెక్ చెప్పటమే కాదు.. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో కేజీ ఉల్లి రూ.25 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేయటం తెలిసిందే. బహిరంగ మార్కెట్లో రూ.150 నుంచి రూ.200 మధ్య ధరలు ఉన్న వేళలోనూ కేజీ రూ.25 ఇచ్చిన జగన్ సర్కార్.. న్యూఇయర్ వేళ నుంచి మరో నిర్ణయాన్ని తీసుకున్నారు.

కేజీ ఉల్లిని రూ.15లకే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజు (జనవరి 1) నుంచి రైతుబజార్లలోని ప్రత్యేక ఉల్లి కౌంటర్లలో తగ్గింపు ధరలకు ఉల్లిని ప్రజలకు అందించాలని నిర్ణయించారు. రైతుల నుంచి కేజీ ఉల్లి రూ.50 నుంచి రూ.60 మధ్య తెప్పిస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మాత్రం వాటిని రూ.15లకే ఇవ్వాలని నిర్ణయించింది.

ఏపీ వ్యాప్తంగా 130 రైతుబజార్లు ఉండగా.. 101 పెద్ద యార్డుల్లో ఉల్లి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ.. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ మోడీ సర్కారు భారం మోపేలా నిర్ణయం తీసుకుంటే.. అందుకు భిన్నంగా జగన్ సర్కారు మాత్రం కేజీ ఉల్లిని ఊహించని ధరకు ప్రజలకు అందించాలన్న నిర్ణయం తీసుకొని న్యూఇయర్ వేళ పర్ ఫెక్ట్ గిఫ్టును ప్రజలకు ఇచ్చిందని చెప్పక తప్పదు.