Begin typing your search above and press return to search.

కీలకమైన జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 1:30 PM GMT
కీలకమైన జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదా?
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అయితే 175కి 175 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.

అయితే 175కి 175 ఏమో కానీ ఏపీ సీఎం జగన్‌ సొంత జిల్లా వైఎస్సార్‌లోనే ఈసారి దెబ్బతినక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే రెండు పార్లమెంటరీ సీట్లు కడప, రాజంపేట ఉన్నాయి.

10 అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల, పార్లమెంటు సీట్లలో రాజంపేటలో వైసీపీ ఓడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలను చెబుతున్నారు.

జిల్లాల విభజనలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాను రెండుగా చేసి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు, వర్గాలు కోరినా సీఎం జగన్‌ రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలే నిరసనలకు, ధర్నాలకు దిగారు.

ఇక రాజంపేట, రాయచోటి, బద్వేలు, కడప, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు తదితర స్థానాల్లో బలిజ (కాపు) ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా సహజంగానే ఈసారి జనసేన వైపు చూస్తున్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన కౌలు రైతు భరోసా యాత్రతో ఆ పార్టీకి బలం పెరిగిందని అంటున్నారు. అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన బలజ నేతలంతా కొద్ది రోజుల క్రితం తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి జనసేనకు జైకొట్టారు.

మరోవైపు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయకపోవడం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపైన అసంతృప్తి ఉందని అంటున్నారు. రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లిఖార్జునరెడ్డి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల ముందు వైసీపీలోకి చేరారు. ఈసారి ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ఇక అభివృద్ధిపరంగా కడప స్టీల్‌ ప్లాంట్, కడప బస్టాండ్‌ నిర్మాణం ఇప్పటివరకు అతీగతీ లేకపోవడం కూడా పట్ల కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.

జగన్‌ మొదటి, రెండో విడత మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్‌ జిల్లా నుంచి మొదటి నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలకు మంత్రి పదవులు వస్తాయని అనుకున్నా ఇవ్వలేదంటున్నారు. కేబినెట్‌ మంత్రి హోదాలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉన్న గడికోట శ్రీకాంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి కూడా జగన్‌ తొలగించారు.

మరోవైపు మొదటి మంత్రివర్గంలో ఉన్న చాలామందిని రెండో మంత్రివర్గ విస్తరణ సమయంలో జగన్‌ తొలగించారు. అయితే డిప్యూటీ సీఎంగా కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషాను మొదటి నుంచి కొనసాగించారు. ఇది కూడా పార్టీ నేతల మధ్య అసమ్మతికి కారణమైందని అంటున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 సీట్లు గెలుచుకుంది. ఈసారి వీటిలో ఐదు సీట్లకు గండిపడే అవకాశముందని అంటున్నారు. అందులోనూ బీజేపీకి సైతం గట్టి అభ్యర్థులు ఉన్నారు. ఆర్థికంగా బలవంతులైన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు) వంటివారు బీజేపీలోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు అంత తేలిక కాదని.. సీఎం సొంత జిల్లాలోనే ఆయనకు షాక్‌ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.