Begin typing your search above and press return to search.

మా క్యాలెండర్ నూ మీరే ప్రకటించండి.. జై షాపై పాక్ వ్యంగ్యం

By:  Tupaki Desk   |   6 Jan 2023 9:30 AM GMT
మా క్యాలెండర్ నూ మీరే ప్రకటించండి.. జై షాపై పాక్ వ్యంగ్యం
X
అసలే క్రికెట్ ఆడే దేశాలు ఓ 15లోపే. అందులోనూ ఏడెనిమిది జట్లు బి గ్రేడ్.మహా అయితే ఐదారు జట్లే టాప్ జట్లు. వీటిలోనూ భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లే లేవు.దక్షిణాఫ్రికా, శ్రీలంక క్రికెట్ అగమ్యగోచరంగా ఉంది. అఫ్గానిస్థాన్ పరిస్థితి తెలిసిందే. కానీ, ఇందులోనూ వర్గాలు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ధనిక బోర్డంటూ అసూయ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తమ దేశ క్రికెట్ ను చంపేస్తోందంటూ ఇతర దేశపు బోర్డుల గగ్గోలు.

వీటన్నిటినీ ఇలా ఉంచితే భారత్-పాక్ బోర్డుల మధ్య నిత్యం రగడే. దీనికితగ్గట్లే మాజీ ఆటగాళ్లూ వ్యాఖ్యలు చేస్తుంటారు. దీనికితోడు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ రెండేళ్ల క్యాలెండర్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించడం పాక్ కు కోపం తెప్పిస్తోంది.

ఆతిథ్యం పాక్ ది.. క్యాలెండర్ భారత్ 2021 సెప్టెంబరులోనే ఆసియా కప్ ముగిసింది. 2023లో మరోసారి కప్ జరగనుంది. గతేడాది జరిగింది టి20 ఫార్మాట్ లో అయితే ఈసారి జరగబోయేది వన్డే ఫార్మాట్ లో.కాగా, సెప్టెంబరులో కప్ ఉంటుందని ఆసియా క్రికెట్‌ సంఘం (ఏసీసీ) తెలిపింది.

ఆ వెంటనే భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. గురువారం ఆసియా కప్ క్యాలెండర్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. దీనిపై పాకిస్థాన్ మండిపడింది. ‘‘ఏసీసీ క్యాలెండర్‌ను ముఖ్యంగా పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చే ఆసియాకప్‌ వివరాలను ఏకపక్షంగా ప్రకటించినందుకు జై షాకు కృతజ్ఞతలు. పీఎస్‌ఎల్‌ 2023 క్యాలెండర్‌నూ మీర ప్రకటించండి’’ అని పీసీబీ అధిపతి నజమ్‌సేథి వ్యంగంగా ట్వీట్‌ చేశాడు. అసలు టోర్నీ ఎక్కడ జరుగుద్ది? ఆసియా కప్ గత టోర్నీ దుబాయ్ ఆతిథ్యమిచ్చింది. ఈసారి షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, చిత్రం ఏమంటే.. టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంతవరకు చెప్పలేదు. కనీసం షెడ్యూలునూ ప్రకటించలేదు.

భారత్-పాక్ మధ్య వివాదాల నేపథ్యంలో మన జట్టు పాకిస్థాన్ వెళ్లడమే లేదు.2008 నవంబరు 26 నాటి ముంబై దాడుల అనంతరం పాక్ మన దేశానికి రాలేదు. నాటి, నేటి కేంద్ర ప్రభుత్వాలు భారత జట్టును పాక్ పర్యటనకు పంపేందుకు అనుమతించడం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కూడా ఆ దేశంలో ఆడడానికి సిద్ధంగా లేదు.ఆసియా ఆడకుంటే ప్రపంచ కప్ కు రాం: పాక్ తమ దేశంలో ఆసియా కప్ నిర్వహణ జరగకున్నా.. టీమిండియా ఆ పర్యటనకు రాకున్నా.. తాము భారత్ లో జరిగే 2023 ప్రపంచ కప్ ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ఇప్పటికే ప్రకంటించింది.

అయితే, ఈ విషయం అంత తేలిగ్గా అయ్యేది కాదు. దీనికి ఐసీసీ నిబంధనలు కూడా ఉంటాయి. కాబట్టి పాక్ బెదిరింపులు సీరియస్ గా తీసుకునేవి కాదు. కాగా, 2023 ఆసియాకప్‌లో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, ఓ క్వాలిఫయర్‌ పోటీపడతాయి. భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి!అయితే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ రెండేళ్ల క్యాలెండర్‌ను జై షా ప్రకటించడాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తప్పు పట్టింది. అతడు ఏకపక్షంగా వ్యవహరించాడని ఆరోపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.