Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ .. అందుబాటులోకి వచ్చిన మరో కరోనా 'టీకా' !

By:  Tupaki Desk   |   12 April 2021 10:30 AM GMT
గుడ్ న్యూస్ .. అందుబాటులోకి వచ్చిన మరో కరోనా టీకా !
X
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సిన్ల కొరత కొంతవరకు వేధిస్తుంది. ఈ సమయంలో దేశానికి భారీ ఊరట క‌లిగించే విష‌యం జరిగింది. ర‌ష్యా దేశానికీ చెందిన స్పుత్నిక్ వి క‌రోనా వ్యాక్సిన్ ను దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి ఎక్స్ ‌ప‌ర్ట్ క‌మిటీ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనితో భారతదేశంలో ఆమోదం పొందిన మూడో క‌రోనా వ్యాక్సిన్ ‌గా స్పుత్నిక్ వి నిలిచింది. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్ ‌కు చెంద‌ని కొవాగ్జిన్‌, సీర‌మ్ త‌యారుచేస్తున్న కొవిషీల్డ్‌ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. గ‌త వారం వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా డాక్ట‌ర్ రెడ్డీస్ ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

దీనితో సోమ‌వారం డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల క‌మిటీ దీనిపై చ‌ర్చించ‌డానికి స‌మావేశ‌మైంది. ఆ వెంట‌నే వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణుల క‌మిటీ ఆమోదం ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో హైద‌రాబాద్‌కు చెందిన‌ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ త‌యారు చేస్తోంది. ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేయా రీసెర్చ్ ఇన్‌ స్టిట్యూల్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ అండ్ మైక్రోబ‌యోల‌జీ దీనిని అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 91.6 శాతంగా ఉన్న‌ట్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తేలింది.

సెకండ్‌ వేవ్ ‌తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ విలయతాండవంతో లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 12 లక్షలకు పైగా కేసులున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు రెండు రకాల కరోనా టీకాలను అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 10కోట్ల 45 లక్షల 28వేల 565 డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.