Begin typing your search above and press return to search.

ఇంకో మెడికో మృతి..తిరుప‌తిలో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   13 Aug 2018 4:31 AM GMT
ఇంకో మెడికో మృతి..తిరుప‌తిలో ఏం జ‌రుగుతోంది?
X

తిరుపతిలో మ‌రో దారుణం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో మెడికో శిల్ప బలవన్మరణ ఘటనను మరువక ముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంబిబిఎస్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని గీతిక (18) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వారంలో పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కొందరు స్నేహితులు చెబుతున్నారు. గీతిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న మెడికోలు పెద్ద ఎత్తున రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్చురీలోని మతదేహాన్ని చూసి బోరున విలపించారు. అయితే ఇప్పటికీ శిల్ప ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమయ్యారు.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన గీతిక (18) శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో రెండో సంవత్సరం ఎంబిబిఎస్‌ చదువుతోంది. తండ్రి విజయ్‌ భాస్కర్‌ రెడ్డి పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన న్యాయవాదిగా పనిచేశారు. తిరుపతి శివజ్యోతినగర్‌ లోని ఎస్‌ వి ఎన్‌ క్లేవ్‌ అపార్టుమెంట్‌ లో తల్లి హరితదేవితో కలిసి ఉంటోంది. అయితే గీతిక నాలుగు నెలల క్రితం సుదర్శన్‌ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను గీతికను రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి గీతికను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన గీతిక చదువుకుంటానంటూ ఆదివారం సాయంత్రం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో తల్లి చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్దలు కొట్టి చూసింది. అప్పటికి గీతిక కొన ఊపిరితో ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ గీతిక మృతిచెందింది.