Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ జోరు...రాష్ట్ర ప్రజలకు సీఎం ధన్యవాదాలు

By:  Tupaki Desk   |   20 Sep 2021 6:44 AM GMT
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ జోరు...రాష్ట్ర ప్రజలకు సీఎం ధన్యవాదాలు
X
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఫలితాల్లో వైసీపీ జోరు కొనసాగింది. 13 జిల్లాల్లో అధికార పార్టీ హవా చాలా స్పష్టంగా కనిపించింది. 90శాతానికిపైగా జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకోగా, టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎంపీటీసీల్లోనూ వైసీపీ.. సత్తా చూపింది. చాలా జిల్లాల్లో క్వీన్‌ స్వీప్‌ చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ భారీస్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో అధికారపార్టీ గెలిచింది.

ఈనెల 25న జడ్పీచైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ లో 6 వేల 985 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసూకెళ్లింది. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. కర్నూలులో మొత్తం 52 జడ్పీటీసీలు వైసీపీ కైవసం చేసుకుంది. నెల్లూరులో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 90 శాతనికి పైగా జడ్పీటీసీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఎంపీటీసీల్లోనూ ఫ్యాన్ పార్టీదే హవా. మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాల్లో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7 వేల 220 స్థానాలకుగాను 18 వేల 782 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఏప్రిల్‌ 8న ఆయా స్థానాలకు పోలింగ్‌ జరిగింది. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఓట్లు లెక్కించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా కొందరు తెలుగు తమ్ముళ్లు బరిలోకి దిగారు. కుప్పం పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మడకశిర మండలంలో 1 ఎంపీటీసీకి సంబంధించి రీపోల్‌ కు అవకాశం ఉందని పంచాయితీ రాజ్ కమిషనర్‌ చెప్పారు. దీనిపై ఎస్ ఈ సీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం జగన్ పాలనకు మరోసారి ప్రజల నుంచి ఆశీస్సులు అందాయని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు సీఎం జగన్. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. సోమవారం ఉదయం లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. సోమవారం ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.