Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్.. రెడ్లకు పదవుల్లో కోత?!

By:  Tupaki Desk   |   7 Jun 2019 1:05 PM GMT
జగన్ కేబినెట్.. రెడ్లకు పదవుల్లో కోత?!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పరుస్తున్న తొలి కేబినెట్లో సామాజికవర్గ సమీకరణాలు ఆసక్తిదాయకంగా మారాయి. ఏకంగా యాభై శాతం మంత్రి పదవులను బలహీన వర్గాలకే కేటాయించనున్నట్టుగా తన పార్టీ మీటింగులో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం మంత్రి పదవులు దక్కబోతున్నట్టుగా జగన్ ప్రకటించారని సమాచారం.

పాతిక మంత్రి పదవుల్లో పన్నెండుకు పైగా ఆ వర్గాలకే వారికే దక్కబోతున్నాయని అలా స్పష్టం అవుతోంది. ఇక మిగిలిన శాఖలను ఓసీలకు, కాపులకు పంచాల్సి ఉంది. ఈ నేఫథ్యంలో రెడ్లకు మంత్రి పదవుల విషయంలో భారీగా కోత పడుతోందని సమాచారం.

ముందుగా జరిగిన ప్రచారం ఏమిటంటే.. కనీసం ఏడు మంత్రి పదవులు రెడ్డి సామాజికవర్గానికి దక్కవచ్చని వార్తలు వచ్చాయి. ఎలాగూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో రెడ్లే మూడో వంతు ఉన్నారు. కాబట్టి కేబినెట్లో మాత్రం దక్కవచ్చని అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కేవలం నలుగురు రెడ్లకు మాత్రమే మంత్రి పదవులు దక్కబోతూ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన మూడు మంత్రి పదవులు కోత పడినట్టే అని తెలుస్తోంది.

పన్నెండు మంత్రి పదవులు ఓసీలకు ఉంటాయని అనుకుంటే.. అందులో రెండు కాపులకు, ఒకటి కమ్మ సామాజికవర్గానికి దక్కే అవకాశం ఉంది. బ్రహ్మణుల, క్షత్రియుల కోటా రెండు పదవులు పోతాయి. వైశ్యులకు ఒకటి అనుకుంటే.. అక్కడే ఏడు పదవులు భర్తీ అయినట్టే. ఐదులో కనీసం నలుగురు రెడ్లకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. మరి ఆ నలుగురులో సీనియర్ పొలిటీషియన్లే ఉన్నారు. కాబట్టి కొంతమంది యువ రెడ్డి ఎమ్మెల్యేలకు ఈ దఫా అవకాశం దక్కకపోవచ్చునేమో!