Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్నా ఇటు చూడ‌న్నా ! నో బీమా నో ధీమా !

By:  Tupaki Desk   |   17 Jun 2022 11:30 PM GMT
జ‌గ‌న‌న్నా ఇటు చూడ‌న్నా ! నో బీమా నో ధీమా !
X
పంట‌ల బీమా చెల్లింపుల్లో అంతా పార‌దర్శ‌కంగానే చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి చెబుతున్నారు. కానీ దీనిపై ఇప్ప‌టికే ప‌లు అనుమానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆశించిన తీరులో బీమా చెల్లింపులేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కానీ వీటిని ఒప్పుకునేందుకు అధికార పార్టీ మ‌న‌సు ఎందుక‌ని అంగీక‌రించ‌డం లేద‌ని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏటా తమ త‌ర‌ఫున బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తున్నామ‌ని చెబుతున్న స‌ర్కారు ఎందుకని అర్హ‌త మేర‌కు ఇవ్వ‌లేక‌పోతోంద‌ని నిల‌దీస్తోంది. ప్ర‌కాశం జిల్లా, ముండ్ల‌మూరు మండ‌లం, మారెళ్ల‌లో.. బీమా చెల్లింపుపై అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి. అదేవిధంగా అర్ధ‌వీడు మండ‌లం మాగుటూరులో కూడా ఇదేవిధంగా ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

బీమా చెల్లింపుల్లోనూ, నష్ట ప‌రిహారం పంపిణీలోనూ అవ‌కత‌వ‌క‌లు చోటుచేసుకోవ‌డంతో ఈ రెండు చోట్లా రైతు భరోసా కేంద్రాల‌కు తాళాలు వేసి మ‌రీ సేద్య‌గాళ్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సంబంధిత అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు.

తాము జామాయిల్ తోట‌లు సాగుచేస్తే మిర్చి పంట సాగు చేసిన‌ట్లు ఏ విధంగా రికార్డుల్లో రాసుకుంటారని ముండ్ల‌మూరు ఏఓ శ్రీ‌ధ‌ర్-ను, వీఏఏ బాల వెంక‌ట‌య్య‌ను నిల‌దీయ‌డంతో వారు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. పంటల‌ను పరిశీలించారు.

ఇదేవిధంగా మాగుటూరులో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు వ్యక్తం అయ్యాయి. పోలీసుల జోక్యంతో నిర‌స‌న‌లు కాస్త త‌గ్గాయి. అదేవిధంగా రైతు భ‌రోసా కేంద్రాల‌కు ప‌డిన తాళాలు కూడా తెరుచుకున్నాయి. మాగుటూరులో బసిరెడ్డిప‌ల్లి, సుగాలి తండా, మాగ‌టూరు బీసీ కాల‌నీల‌కు చెందిన రైతు భ‌రోసా కేంద్రాల‌కు నిర‌స‌న సెగ‌లు తగిలాయి.

అదేవిధంగా కోన‌సీమ జిల్లాలోనూ రైతులు పరిహారం అంద‌లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక్క‌డ కె.గంగ‌వ‌రం మండ‌లం, ఊడిమూడి గ్రామంలో వివాదం నెలకొంది. 439 మంది రైతులు 530 ఎక‌రాల్లో సాగు చేసినా పంట‌లు దెబ్బ‌తిన‌డంతో వీరంతా పరిహారం అంద‌క క‌న్నీటిపర్యంతం అవుతున్నారు. వెంటనే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని వేడుకుంటున్నారు.