Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఇసుక ఇకపై నేరుగా కొనుక్కొవచ్చు !

By:  Tupaki Desk   |   17 April 2021 7:30 AM GMT
జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఇసుక ఇకపై నేరుగా కొనుక్కొవచ్చు !
X
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ఇకపై ఇసుక కావాలనుకునేవారు ఇకపై నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు ఆఫ్‌ లైన్‌ ద్వారా ఇసుక విక్రయాలు జరుపాలని స్పష్టం చేసింది. ఎవరైనా నేరుగా ఇసుక రీచ్, స్టాక్ యార్డ్‌కు వెళ్లి, ఇసుక నాణ్యతను పరిశీలించుకున్న తరువాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చునని తెలిపింది. అయితే సమీపంలోని ప్రజలు ఇప్పటివరకు ఎడ్ల బళ్లతో పాటు ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ట్రాక్టర్లను తొలగించింది. కేవలం ఎడ్ల బళ్లలో మాత్రమే సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లాలని స్పష్టంచేసింది.

గతంలో ఇసుక రీచ్ ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ జాబితా నుంచి ట్రాక్టర్ ‌ను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు, ఇసుక కాంట్రాక్టర్ ప్రతీ రీచ్‌ కు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి. దీనికి కూపన్ల విధానం అమలుచేయాలని తెలిపింది. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ యార్డులో ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. ఇక ఇసుక కొనుగోలు చేసే ప్రతీ కొనుగోలు దారుకు సంబంధిత బిల్లులు, వాహనం నెంబర్‌తో సహా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాల విషయంలో గనుల శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలంది. ఇక ఇసుక రీచ్ కాంట్రాక్ట్ పట్టిన కాంట్రాక్టర్, ఇసుకను రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెలిపింది. ఇసుక అక్రమాలపై జిల్లా కలెక్టరు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించింది.