Begin typing your search above and press return to search.

రుషికొండ తవ్వకాలకు బిగ్ బ్రేక్... వైసీపీ ఎంపీ పోరాటమిది

By:  Tupaki Desk   |   11 May 2022 8:29 AM GMT
రుషికొండ తవ్వకాలకు బిగ్ బ్రేక్... వైసీపీ  ఎంపీ పోరాటమిది
X
విశాఖ జిల్లాలో రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టుల పేరిట భారీ ఎత్తున తవ్వకాలకు తెర తీశారు. అయితే ఆ తవ్వకాలకు సడెన్ గా బిగ్ బ్రేక్ పడిపోయింద్. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ తవ్వకాల మీద స్టే విధించింది. దాంతో ఒక విధంగా ఇది అధికార పార్టీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

నిజానికి రుషికొండ వద్ద తవ్వకాలు అన్నీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని టీడీపీ జనసేన రెండూ కూడా ఇప్పటికే అన్ని రకాలుగా పోరాటాలు చేపడుతూ వచ్చాయి. ఈ మధ్య టీడీపీ అధినాయకుడు చంద్రబాబు విశాఖ వచ్చినపుడు రుషికొండ తవ్వకాలను పరిశీలించాలనుకున్నారు. దానికి పోలీసులు అడ్డుచెప్పడంతో బాబు ఆగ్రహించారు.

కొండని పిండి చేసి పెద్దలు మింగాలని చూస్తున్నారు. నిజంగా అక్కడ టూరిజం ప్రాజెక్టులే కడుతూంటే ఎందుకు చూపించరు అని మండిపడ్డారు. మేము కనుక అధికారంలోకి వస్తే కొండని పిండి చేసి మింగేసిన వారి నుంచి అంతకు అంతా కక్కించి తీరుతామని కూడా స్పష్టం చేశారు.

ఇక విశాఖ తీర ప్రాంతంలో ఉన్న కొండలే కొండంత రక్షణ. 2014లో హుదూద్ తుఫాన్ విశాఖను ఉఫ్ అని ఊదేయకుండా కాపాడిన ఘనత కూడా ఈ కొండలదే. అలనటి కొండల వద్ద ఎలాంటి పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. అయితే వాటిని కాలదన్ని ఇష్టం వచ్చినట్లుగా కొండను తవ్విపడేస్తున్నారు అని టీడీపీ నేతలు గట్టిగానే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించింది. అంతే కాదు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. ఇక ఈ అంశం మీద వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై పూర్తి స్థాయి అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది.

అదే విధంగా ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ పేర్కొంది. ఇక నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది. మొత్తానికి గత కొన్నాళ్ళుగా రాజకీయ అంశంగా మారి నలుగుతున్న ఈ వివాదానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ విధంగా స్టే రూపంలో తాత్కాలికంగా తెర దించింది అంటున్నారు.