Begin typing your search above and press return to search.

జ్యోతి సురేఖకు జగన్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌!

By:  Tupaki Desk   |   16 Dec 2022 12:32 PM GMT
జ్యోతి సురేఖకు జగన్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. జ్యోతి సురేఖను క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ తాజాగా జీవో–749 జారీ చేశారు.

ఈ ఉత్తర్వు అందిన 30 రోజుల్లోగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు రిపోర్టు చేయాల్సిందిగా జ్యోతి సురేఖకు సూచించారు. కాగా 2019లోనే జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏపీ మంత్రి మండలి సైతం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌ గా నియమించడానికి ఆమోద ముద్ర వేసింది

దీంతో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అధికారిక ప్రక్రియలను పూర్తిచేసి గతనెల 22న ఫైలుకు ఆమోదం తెలిపింది. కాగా జ్యోతి సురేఖ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలను కొల్లగొట్టింది.

కాగా విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలు గెలిచి రికార్డు సృష్టించింది. అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్‌ విభాగంలో మూడు రజత పతకాలు సాధించి దుమ్ము లేపింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో 5వ ర్యాంక్‌ ను సైతం ఒడిసి పట్టింది.

అదే విధంగా..లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లోనూ జ్యోతి సురేఖ పసిడి పతకం నెగ్గింది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ఇలా ఎన్నెన్నో రికార్డులు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను కేంద్ర ప్రభుత్వం సైతం అర్జున అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగమిచ్చి గౌరవించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.