Begin typing your search above and press return to search.

మళ్ళీ మొదటికొచ్చిన విచారణ

By:  Tupaki Desk   |   27 March 2021 6:51 AM GMT
మళ్ళీ మొదటికొచ్చిన విచారణ
X
రాజధాని తరలింపు వ్యవహారం హైకోర్టులో మళ్ళీ మొదటికొచ్చింది. రాజధానిని అమరావతి నుండి వైజాగ్ కు తరలించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అయితే దీనిని వ్యతిరేకిస్తు అమరావతి ప్రాంతంలోని రైతులు కొందరు కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులను అప్పట్లో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జేకే మహేశ్వరి విచారించారు. అయితే మహేశ్వరి హఠాత్తుగా సిఖ్ఖిం హైకోర్టుకు బదిలి అయిన విషయం తెలిసిందే.

ఎప్పుడైతే మహేశ్వరి బదిలి అయిపోయారో అప్పటి నుండి కేసులపై విచారణ ఆగిపోయింది. తాజాగా మహేశ్వరి స్ధానంలో చీఫ్ జస్టిస్ గా వచ్చిన అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజధాని తరలింపు కేసులను విచారించాలని డిసైడ్ అయ్యింది. దాంతో ఈ కేసుల విచారణ మళ్ళీ మొదటినుండి ప్రారంభం అవబోతోంది.

మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ ప్రకటించగానే రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా కోర్టులో కేసులు వేశారు. రకరకాల సెక్షన్లు దాఖలు చేసిన కేసులను అప్పట్లోనే మహేశ్వరి ఒకటిగా కలిపేసి విచారణ చేశారు. ఇటు ప్రభుత్వం అటు ప్రభుత్వ వ్యతిరేక పార్టీల తరపున లాయర్ల వాదనలు దాదాపు క్లైమ్యాక్స్ కు వచ్చిన దశలో చీఫ్ జస్టిస్ బదలీఅయ్యారు.

దాదాపు మూడు నెలల తర్వాత గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం తొందరలోనే విచారణ మొదలుపెడుతోంది. ఒకవైపేమో జగన్ రాజధానిని తరలించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఎలాగైనా రాజధానిని అమరావతి నుండి తరలించకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్ధులు ప్రయత్నిస్తున్నారు.

కోర్టులో కేసుల విచారణ వాయిదా పడుతున్న కారణంగా ప్రభుత్వంలో ఒక విధమైన స్తబ్దత కంటిన్యు అవుతోంది. ఈ కేసుల విచారణ ఎప్పుడు మొదలైనా మూడు నెలల్లోపు పూర్తి చేసేందుకు గోస్వామి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.