Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు షాకింగ్ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   12 Oct 2022 6:07 AM GMT
బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు షాకింగ్ నిర్ణ‌యం!
X
బిగ్ బాస్ రియాలిటీ షోపై ఎప్ప‌టి నుంచో వివిధ వ‌ర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది బూతు షో అని, అశ్లీల‌త‌తో కూడిన కంటెంట్ ఉంటోంద‌ని, ప్రైమ్ టైమ్‌లో కుటుంబం అంతా క‌లిసి టీవీ చూసే స‌మ‌యంలో అస‌భ్య చేష్ట‌లు, ద్వంద్వార్థ సంభాష‌ణ‌ల‌తో కూడిన ఈ షో దారుణంగా ఉంటుంద‌ని ప‌లు సంఘాలు, సీపీఐ నారాయ‌ణ లాంటి నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు షాకింగ్ డెసిష‌న్ తీసుకుంది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకుంటామ‌ని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ మేర‌కు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని హైకోర్టు వెల్ల‌డించ‌డం విశేషం.

ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్‌ ఆరోపిస్తుస్తున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తూ స‌మాజాన్ని క‌లుషితం చేస్తున్న‌ బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనూ, ఇటీవల రెండు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను హైకోర్టులో దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిష‌న్ల‌పై తాజాగా హైకోర్టు ధ‌ర్మాసనం విచార‌ణ జ‌రిపింది. ఇటీవల నెగెటివ్‌ ప్రచారం (నిర్వాహకులే ప్రచారం కోసం వివాదం సృష్టించడం) చేసుకోవడం ఎక్కువైందని ధ‌ర్మాసనం వ్యాఖ్యానించ‌డం విశేషం. ఈ వ్యాజ్యం కూడా అందులో భాగమే అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటిదేమీ లేదని ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోణంలోనే తాము పిల్ దాఖ‌లు చేసిన‌ట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.

ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా బిగ్‌బాస్‌ షో ప్రసారం అవుతోందని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని విన్న‌వించారు. చివ‌ర‌కు ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు కూడా చేస్తున్నారని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని వెల్ల‌డించింది. తదుపరి విచారణను అక్టోబ‌ర్‌ 27కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.