Begin typing your search above and press return to search.

టీడీపీ వ్యవస్థాపకుడికి వైసీపీ మంత్రి ఘన నివాళి

By:  Tupaki Desk   |   18 Jan 2021 12:46 PM IST
టీడీపీ వ్యవస్థాపకుడికి వైసీపీ  మంత్రి ఘన నివాళి
X
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి నేడు. ఆయనకు తెలుగు రాష్ట్రంలోని ప్రజలు, ఏపీలో టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పలువురు నాయకులు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. కాగా వైసీపీ క్యాబినెట్ మంత్రి కొడాలి నాని కూడా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.

కొడాలి నాని రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైంది. 2004లో తొలిసారి నాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ విజయం సాధించారు. 2012లో కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో దేవినేని అవినాష్ పై విజయం సాధించి జగన్ మంత్రి వర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా స్థానం పొందారు.

ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని ఆయనను గుర్తు చేసుకున్నారు. ' ప్రజా నాయకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 25 వ వర్ధంతి. అన్న గారికి ఇవే నా నివాళులు' అంటూ కొడాలి ట్వీట్ చేశారు. 'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మిన ప్రజానాయకుడు స్ఫూర్తిప్రదాత కు ఇవే మా నివాళులు' అంటూ ఆయన నివాళులు అర్పించారు.

కాగా కొడాలి నాని షేర్ చేసిన ట్వీట్ లో ఎన్టీఆర్ ఫోటోతో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. కొడాలి నాని దివంగత నందమూరి హరి కృష్ణ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.