Begin typing your search above and press return to search.

పీకే టీమ్ కి అర్ధం కాని ఏపీ తెలంగాణా ఓటర్లు

By:  Tupaki Desk   |   6 Sep 2022 5:55 PM GMT
పీకే టీమ్ కి అర్ధం కాని ఏపీ తెలంగాణా ఓటర్లు
X
అధికారంలో ఉన్న పార్టీకి పొలిటికల్ స్ట్రాటజీ చేయడం అంత ఈజీ కాదు. ప్రశాంత్ కిశోర్ టీమ్ గ్రౌండ్ లో తిరిగినా ఓటర్లు ఒక విధంగా నాయకులు మరో విధంగా చెబుతున్నారు. ఏపీలో ఓటర్లు జగన్ వైపు ఉన్నారని అంటున్నా అదే పార్టీ నాయకుల పట్ల అంత పాజిటివ్ గా లేరు అన్న మాట వినిపిస్తోంది. ఇక తెలంగాణాలో చూస్తే రెండే సార్లు అధికారంలో టీయారెస్ ఉంది కాబట్టి ఒక విధంగా చూస్తే యాంటీ ఇంకెంబెన్సీ కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. దాంతో ఓటర్ల నాడి ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పడం ఒక విధంగా కష్టమే.

ఇదిలా ఉంటే ప్రశాంత్ కిశోర్ జగన్ వైపు పొలిటికల్ స్ట్రాటజీ చేసి 2019 ఎన్నికల్లో ఆయనను సీఎం ని చేశారు. దాంతో ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆయన మీద తెలుగునాట ఎంతో కొంత నమ్మకం కుదిరింది. అయితే పీకే టీమ్ ఇపుడు టీయారెస్ కి వైసీపీకి కూడా రాజకీయ వ్యూహాలను అందించే పనిలో ఉంది. ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకుని జనాల్లోకి వెళ్తోంది. అయితే ఏపీలో చూస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది తెలియదు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఏపీలో చాలా వర్గాలలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

పట్టణాలు వేరుగా ఉంటాయి. గ్రమాలు చూస్తే మరో విధంగా ఉంటాయి. ఇక చదువరులు, నిరుద్యోగ యువత అభిప్రాయాలు వేరే విధంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి ఇంకో విధంగా ఉంటోంది. ఉపాధ్యాయులు ఇపుడు మరో పెద్ద సెక్షన్ గా ఉన్నారు. వారు కూడా వైసీపీ పట్ల ఎంతో కొంత వ్యతిరేకతతో ఉంటారని అంటున్నారు.

ఇలా ఏపీలో చూస్తే సంక్షేమం మాత్రమే ఉంది. అభివృద్ధి లేదు. దాని మీద చర్చ సాగుతోంది. ఇక సంక్షేమం అని డబ్బా కొడుతున్నా అది అందరికీ అందుతోందా అన్నది మరో చర్చగా ఉంది. ఈ నేపధ్యంలో ఓటర్లు పక్క పక్కన ఇళ్ళలోనే కాదు, ఒకే ఇంట్లో తలో విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న మాట ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ పధకాలు అందే ఓటరు ఎంతో కొంత పాజిటివ్ గా ఉంటే ఏ కారణం చేతనో పధకం అందని వారు అయితే ప్రభుత్వం ఏం చేసింది అని లాజిక్ పాయింట్ తీస్తారు.

ఇదంతా ఒకే ఇంట్లో జరిగే తంతు. సర్వే పేరిట వేళ్లే వారికి దీనికి ఏ విధంగా గణించి పాజిటివ్ గా లేక నెగిటివ్ గా అభిప్రాయాన్ని క్రోడీకరించాలో అర్ధం కాని పరిస్థితి. నిజానికి ఒకపుడు ఒక సెక్షన్ ప్రజలను వాకబు చేసి వారిని సర్వే చేసి యావత్తు ఆ వర్గం అంతా ఒకే విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పే సీన్ ఉండేది. ఇపుడు మాత్రం అలాంటి సీన్ లేదు. ముందే చెప్పుకున్నట్లుగా ఒకే ఇంట్లో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్న నేపధ్యంలో సర్వే ఫలితం కూడా దేనికీ అందకుండా ఉంటోంది.

ఇంకోవైపు చూస్తే జగన్ మీద మోజు పూర్తిగా లేదా అంటే ఉంది. అలాగని వ్యతిరేకత లేదా అంటే అది కూడా ఉంది. మరి ఏది ఎంత శాతం అన్నది పీకే టీమ్ కూడా వడపోసి పట్టుకునేందుకు అవకాశాలు అయితే లేవు అనే చెప్పాలి. ఓటర్ల నాడి వారికి అందడం లేదనే ఒక విధంగా చెప్పుకోవాలి. ఇక అధికారంలో ఉన్న పార్టీ నిఘా మరో వైపు ఉంటుంది. తమ ప్రాంతంలో సర్వే అంటే అధికార పార్టీ నాయకుల ప్రభావం పూర్తిగా అని చెప్పకపోయినా ఎంతో కొంత ఉండి తీరుతుంది. అలాంటి సర్వే నివేదికలలో అసలు నిజాలు రావు అని కూడా అంటారు. దాంతో పీకే టీమ్ ఓకే ఊరిలో వరసబెట్టి రెండు విడతలుగా సర్వే చేస్తే పూర్తి కాంట్రస్ట్ గా అభిప్రాయాలు వచ్చినా వస్తాయని అంటున్నారు.

ఇక తెలంగాణా విషయానికి వద్దాం. ఇక్కడ చూస్తే ఒక సహజ రాజకీయ సూత్రం ప్రకారం టీయారెస్ రెండు సార్లు అధికారంలో వరసగా ఉంది కాబట్టి ఓడిపోవాలి. కానీ ఆల్టర్నేషన్ కోసం రెండు ప్రధాన పార్టీలు చాలా గట్టిగానే పోట్లాడుకుంతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ ఈ రెండూ టీయారెస్ కి అపోజిషన్ లో ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు అసలు పడదు, ఈ రెండు పార్టీలు వేటికవే పోటీ చేస్తే ప్రభుత్వ ఓటింగ్ చీలిపోయి మరోసారి టీయారెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా సహజ రాజకీయ సూత్రమే.

అలాంటపుడు అసలు ఎన్నికలు జరిగితే కానీ అది తేలని వ్యవహారంగానే ఉంటుంది తప్ప సర్వేల పేరిట జనాల వద్దకు ఇప్పటికిపుడు వెళ్తే ఎక్కువ శాతం వ్యతిరకత అధికార టీయారెస్ మీద కనిపించవచ్చు. మొత్తానికి చూస్తే ఇక్కడ కూడా ఒక విషయం స్థూలంగా చెప్పుకోవచ్చు. కేసీయార్ మీద ఈ రోజుకీ జనాలకు పూర్తిగా వ్యతిరేకత లేదు. దిగ్గజ నాయకుడిగా ఆయనే తెలంగాణాలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల పనితీరు వల్ల టీయారెస్ ఇబ్బంది పడితే పడవచ్చు. మరి దానికి అధికార పార్టీ చేసుకునే రిపేర్లు చేసుకుంటుంది. అలాగే ఓట్ల చీలిక అన్నది తెలంగాణాలో ఫలితాన్ని మారుస్తుంది అన్న లెక్కలు కూడా ఉన్నాయి. దాంతో పీకే టీమ్ ఈ రోజు జనాల్లోకి వెళ్ళి చేసే సర్వేలు ఎంత వరకు కరెక్ట్ అన్న భావన అయితే అంతటా ఉంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.