Begin typing your search above and press return to search.

అమరావతిలో విద్యుత్తు వెలుగులు

By:  Tupaki Desk   |   19 Nov 2015 11:14 AM GMT
అమరావతిలో విద్యుత్తు వెలుగులు
X
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి విద్యుత్తు వెలుగులతో వెలిగిపోనుంది. అమరావతి పరిధిలో ఏకంగా 64 సబ్ స్టేషన్ లను నిర్మించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు పక్కా ప్రణాళికను రూపొందించారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి ఐదు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఒక విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. అలాగే, ప్రతి మూడు వేల త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు ఒక సబ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అమరావతిలో 64 సబ్ స్టేషన్లు నిర్మించాలని, ఒక్కో దానిని పది సెంట్లలో నిర్మించాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు 400 కేవీ సబ్ స్టేషన్ ఒకటి, 220 కేవీ సబ్ స్టేషన్లు రెండు, 120 కేవీ సబ్ స్టేషన్లు ఏడింటిని కూడా ఏర్పాటు చేయాలని ట్రాన్స్ కో ప్రతిపాదించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇంటి వద్ద సబ్ స్టేషన్ పూర్తయింది. ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

అంతేనా.. విద్యుత్తు విషయంలో చాలా చోట్ల చోటు చేసుకునే లోపాలు - పొరపాట్లను అమరావతిలో పునరావృతం కాకూడదని కూడా నవ్యాంధ్ర సర్కారు భావిస్తోంది. అమరావతి పరిధిలో ముఖ్య ప్రాంతాల్లో ఎక్కడా హెచ్ టీ లైన్లను వేయకూడదని, విద్యుత్తు భారీ టవర్లను నిర్మించకూడదని నిర్ణయించారు. హెచ్ టీ లైన్లను కేపిటల్ బయటి నుంచే తీసుకురానున్నారు.