Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులే ‘ఏసీటీవో పద్మ’కు స్వాగతం చెప్పారు

By:  Tupaki Desk   |   29 Jun 2016 8:14 AM GMT
ఏపీ మంత్రులే ‘ఏసీటీవో పద్మ’కు స్వాగతం చెప్పారు
X
ఏపీ రాజధానిలో ఇప్పుడంత సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపీ శాఖలు.. ఉద్యోగులు ఏపీ బాట పడుతున్న వేళ అంతా హడావుడిగా ఉంది. హైదరాబాద్ నుంచి తరలివెళుతున్న ఉద్యోగుల ఏర్పాట్లు.. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు మంత్రులు.. అధికార యంత్రాంగం ప్రత్యేక వసతులు చూసుకోవటం.. వారి యోగ క్షేమాల్ని తెలుసుకోవటం లాంటి వరుస కార్యక్రమాలతో ఒకింత ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ రాజధానికి తరలి వెళ్లే విషయంలో హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవో పని చేస్తున్న పద్మ హైదరాబాద్ నుంచి బెజవాడకు సైకిల్ మీద ప్రయాణం కావటం తెలిసిందే. ఏపీ మీద తనకున్న అభిమానాన్ని చాటుతూ ఆమె స్టార్ట్ చేసిన సైకిల్ యాత్రకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఆమె బెజవాడకు చేరుకున్నారు. ఆమెకు స్వాగతం చెప్పేందుకు ఏపీ మంత్రులే స్వయంగా రావటం.. ఆమెను అభినందించి.. ఏపీకి స్వాగతం చెప్పారు.

పద్మ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులు.. స్థానికులు కేరింతలు.. చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. తన సైకిల్ యాత్రను ముగించి ఏపీ రాజధానికి చేరుకున్న పద్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సౌకర్యాలు చాలా బాగున్నాయని.. నవ్యాంధ్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పుకొచ్చారు.మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి తరలి వస్తున్న ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కారు.. మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించటంతో పాటు.. వారికి తామంతా ఉన్నామన్న భరోసా.. ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా చెప్పొచ్చు. దశాబ్దాల తరబది ఉన్న హైదరాబాద్ వదిలిపెట్టి రావటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్న భావనకు ఉద్యోగులు గురయ్యేలా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు.