Begin typing your search above and press return to search.

సారీ చెప్పి రైతు ఇంటికే తీసుకెళ్లి బొలెరో ట్రక్కు డెలివరీ

By:  Tupaki Desk   |   31 Jan 2022 4:30 AM GMT
సారీ చెప్పి రైతు ఇంటికే తీసుకెళ్లి బొలెరో  ట్రక్కు డెలివరీ
X
మిగిలిన వారికి భిన్నంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త.. తొలిసారి ఒక కీలక అంశంపై స్పందించేందుకు కొన్ని గంటల పాటు సమయాన్ని తీసుకున్నారు. ఆయనే.. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. కర్ణాటకకు చెందిన రైతు ఒకరు తమ మహీంద్రా షోరూంకు ట్రక్కు కొనేందుకు వెళ్లటం.. అక్కడి సేల్స్ ఎగ్జిక్యూటివ్.. సదరు రైతును అవమానిస్తూ.. నువ్వు కారు కొనటమా? అంటూ ఎటకారం చేయటం.. సదరు రైతుకు ఒళ్లు మండి గంటలో డబ్బులు తెస్తానని చెప్పి.. అందుకు తగ్గట్లే గంటలో రూ.10లక్షలు తీసుకొచ్చి.. షోరూం వారికి షాకివ్వటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావటం.. దాన్ని ఆనంద్ మహీంద్రాకు పలువురు ట్యాగ్ చేశారు.

సాధారణంగా ఏదైనా విషయానికి వెంటనే రియాక్టు అయ్యే ఆనంద్ మహీంద్రా.. తాజా ఎపిసోడ్ లో మాత్రం కాస్త ఆలస్యంగానే స్పందించారు. షోరూంలో సదరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్పందించిన తీరును ఖండిస్తూ.. చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే.. కథ ఇక్కడితో పూర్తి కాలేదు. ఆ తర్వాత చాలానే జరిగిన విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

మహీంద్రా షోరూంలో అవమానానికి గురైన రైతు కెంపెగౌడ ఇంటికి మహీంద్రా సీనియర్ సేల్స్ మేనేజర్ వెళ్లటమే కాదు.. వారి ఇంటికే తీసుకెళ్లి వాహనాన్ని డెలివరీ చేయటంతో పాటు.. తమ వాహనం కొనాలని రిక్వెస్టు చేశారు. షోరూంలో జరిగిన దానికి క్షమాపణలు చెబుతూ.. జరిగిన దానికి మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లుగా చెప్పారు. తమ వాహనాన్ని కొనేందుకు సదరు రైతు ఒప్పుకున్నందుకు ఆయనకు కంపెనీ ధన్యవాదాలు తెలిపింది.

తాజాగా సదరు రైతు మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. మహీంద్రా ఉద్యోగులు తమ ఇంటికి వచ్చి సారీ చెప్పి.. వాహనాన్ని డెలివరీ చేసిన వైనాన్ని చెబుతూ.. వారు అదే రోజు సాయంత్రానికి వాహనాన్ని డెలివరీ చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రైతు కెంపెగౌడకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా పేర్కొనటమే కాదు.. సమస్య పరిష్కారమైందని కంపెనీ తెలిపింది. వివాదం సమిసిపోయినందుకు మహీంద్రా వాహనాన్ని కొనాలని కెంపెగౌడకు ట్వీట్ చేశారు. మొత్తంగా. యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. ఏమైనా రైతుకు జరిగిన అవమానంపై మహీంద్రా స్పందించిన తీరు.. తర్వాత చేపట్టిన చర్యలపై సానుకూల స్పందనలు వెలువడుతున్నాయి. మొత్తానికి కథ కంచికి వెళ్లింది.. బొలెరా వాహనం మాత్రం సదరు రైతు ఇంటికే వెళ్లింది.