Begin typing your search above and press return to search.

ఈ విద్యార్థులు నిండా మునిగినట్లేనా ?

By:  Tupaki Desk   |   19 Aug 2022 9:30 AM GMT
ఈ విద్యార్థులు నిండా మునిగినట్లేనా ?
X
ఉక్రెయిన్లో వైద్య, డెంటల్, ఫార్మసీ చదివేందుకు ఇండియా నుండి వెళ్లిన విద్యార్థులు నిండి మునిగి పోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుధ్ధం కారణంగా ఉక్రెయిన్లో మెడికల్ చదువుతున్న సుమారు 20 వేలమంది విద్యార్ధులు అర్ధాంతరంగా ఇండియాకు వచ్చేశారు. యుద్ధం కారణంగా మార్చిలో వీళ్ళంతా ఇండియాకు వచ్చేశారు. మరికొద్ది రోజులుంటే వీళ్ళ మెడికల్ చదువు అయిపోయేది. అంటే కాలేజీ చదువు పూర్తి చేసి ఇక ఫైనల్ గా పరీక్షలు రాయబోతున్నారనే సమయంలో యుద్ధం మొదలైంది.

ఉక్రెయిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన తమను ఇండియా కాలేజీల్లో చేర్చుకోవాలని విద్యార్ధులంతా పదే పదే డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్ నుండి ఇక్కడి విద్యార్ధులకు పిడుగులాంటి కబురందింది. అదేమిటంటే సెప్టెంబర్ నుండి కాలేజీలు తెరుస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులందరు తప్పనిసరిగా కాలేజీలకు హాజరవ్వాల్సిందే అని అందులో యాజమాన్యాలు ఆదేశించాయి. ఉక్రెయిన్లో మెడికల్ డిగ్రీ రావాలంటే క్రోక్, క్రోక్-1, క్రోక్-2 పరీక్షలు పాసవ్వాల్సిందే.

ఇపుడా క్రోక్ పరీక్షలకు అవసరమైన క్లాసులనే సెప్టెంబర్లో మొదలు పెడుతున్నట్లు యూనివర్సిటీలు విద్యార్దులకు ఇఛ్చిన సమాచారంలో చెప్పాయి. ఆన్ లైన్లో తరగతుల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి కచ్చితంగా క్లాసులకు హాజరుకావాల్సిందే అని యానివర్సిటీలు స్పష్టంగా చెప్పేశాయి.

క్లాసులకు హాజరైన వారే పరీక్షలు రాయగలరు లేకపోతే అందరు ఫెయిలైనట్లే. ఒకవైపు యుద్ధం జరుగుతునే ఉంది. మరోవైపు కాలేజీలు తెరుస్తున్నట్లు యాజమాన్యాలు సమాచారమిచ్చాయి. దాంతో ఏమిచేయాలో వేలాదిమంది విద్యార్ధులకు దిక్కుతోచటంలేదు.

ఉక్రెయిన్లోకి అడుగుపెడితే యుద్ధం నేపధ్యంలో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. అలాగని ఆన్ లైన్లోనే తరగతులకు హాజరవుతామని విద్యార్ధులు రిక్వెస్ట్ చేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. అసలు ఉక్రెయిన్ కు భారత్ నుండి విమానాలు వేస్తారో లేదో కూడా తెలీదు.

ఈ దశలో ఏమిచేయాలో తెలీక వేలాదిమంది విద్యార్ధులు అవస్తలు పడుతున్నారు. వేలాదిమంది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఉక్రెయిన్ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది.