Begin typing your search above and press return to search.

స్మృతి గురించి అడిగితే ఈ ప్రశ్నలేంది జైట్లీసాబ్?

By:  Tupaki Desk   |   14 April 2019 5:19 AM GMT
స్మృతి గురించి అడిగితే ఈ ప్రశ్నలేంది జైట్లీసాబ్?
X
ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఎప్పటికి కాదు. ఈ చిన్న విషయం కేంద్రమంత్రి.. సీనియర్ లాయర్ అయిన అరుణ్ జైట్లీకి తెలియంది కాదు. కానీ.. ఆయన లాయర్ తో పాటు రాజకీయ నేత కూడా. ప్రశ్నకు ప్రశ్నతో సమాధానం చెప్పే ప్రయత్నం చేసి.. జైట్లీ కూడా ఇలాంటోడా? అన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.

గల్లీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు.. విమర్శలకు.. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా.. ప్రశ్నకు ప్రశ్న.. తిట్టుకు తిట్టు తిట్టుకోవటం లాంటివి చేస్తుంటారు. తాజాగా జైట్లీ మాష్టారి తీరు కూడా ఇందుకు భిన్నంగా లేదు.

కేంద్రమంత్రి స్మృతి దాఖలు చేసిన తాజా నామినేషన్లో తన చదువు విషయంలో అడ్డంగా బుక్ అయ్యారన్న ప్రచారం జోరందుకున్న వేళ.. జైట్లీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కాసింత ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. స్మృతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద సమాధానం చెప్పని జైట్లీ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ డిగ్రీల మీద ప్రశ్నలు వేయటం చూస్తే.. స్మృతిమేడమ్ విషయంలో బీజేపీ నేతలు తెల్లజెండా ఎగురవేసినట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

స్మృతి విద్యార్హత మీద రచ్చ నడుస్తున్న వేళ.. జైట్లీ తన ఫేస్ బుక్ బ్లాగ్ లో.. విపక్షాలు ప్రచారానికి ఒక కారణాన్ని అద్దెకు తీసుకున్నాయన్న శీర్షికతో రాసుకొచ్చారు. అందులో రాహుల్ మీద పలు ఆరోపణలు చేశారు. రాహుల్ విద్యార్హత విషయంలో తప్పులు చెబితే.. ఆ విషయాల్ని ఆధారాలతో ఉతికి ఆరేయాలి. అంతేకానీ.. స్మృతి తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు.. రాహుల్ ప్రస్తావన తేవటంలో అర్థం లేదని చెప్పక తప్పదు.