Begin typing your search above and press return to search.

ప్యాకేజీపై జైట్లీ ప్రచారాస్త్రాలు

By:  Tupaki Desk   |   9 Sep 2016 5:23 AM GMT
ప్యాకేజీపై జైట్లీ ప్రచారాస్త్రాలు
X
పార్లమెంటులోనూ.. ప్రజల ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కిన మోడీ సర్కారు.. హోదా కాదు.. ప్యాకేజీ అంటూ డిసైడ్ చేయటం తెలిసిందే. ఈ అంశంపై సీమాంధ్ర ప్రజలు సీరియస్ కావటం తెలిసిందే. తాము ప్రకటించిన ప్యాకేజీపై ఏపీ సర్కారును కన్వీన్స్ చేసిన చందంగానే ఏపీ ప్రజల్ని సంతృప్తిపర్చాలని మోడీ సర్కారు భావిస్తుందా? అంటే.. అవుననే భావన వ్యక్తమవుతోంది. బుధవారం అర్థరాత్రికి కాస్త అటూఇటూగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించటం.. దానిపై సీమాంధ్రుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తాము ప్రకటించే ప్యాకేజీ పట్ల ఏపీ ప్రజలు సంతృప్తి చెందరన్న విషయం తెలిసినా.. మరీ ఈ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతాయని.. వ్యతికేత వస్తుందని మోడీ సర్కారు ఊహించలేదు. అందుకే.. ప్యాకేజీ అంశంపై అరుణ్ జైట్లీ ఏపీ మీడియాకు చెందిన పలు సంస్థలతో గురువారం ప్రత్యేకంగా మాట్లాడటం కనిపిస్తుంది. ఏపీ ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవటంతో పాటు.. ఏపీకి తాము ఎంతో చేస్తున్నామన్న సందేశాల్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అరుణ్ జైట్లీ. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీమాంధ్రులకు ఉండే అభ్యంతరాలు సీమాంధ్రులకు ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా ఏపీకి ఎంతో చేసినట్లుగా అరుణ్ జైట్లీ చెబుతున్న మాటలు వింటే.. విషయం ఇట్టే అర్థం కాక మానదు. ప్రముఖ మీడియా సంస్థలకు ప్యాకేజీపై ప్రత్యేకంగా ఇచ్చిన జైట్లీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన అంశాలు చూస్తే ఏపీ విషయంలో వారు ఏమనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారో ఇట్టే అర్థమవుతుంది.

= గడిచిన 27నెల్లలో మేం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్యాకేజీలు.. చేసిన సహాయం భారతదేశ చరిత్రలో ఎవ్వరూ.. ఎన్నడూ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 13 జిల్లాల సీమాంధ్రకు ఐదేళ్లలో రూ.64 కోట్లు లభించాయి. మా ప్రభుత్వ హయాంలో ఐదేళల్లో.. 14వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద కానీ.. కేంద్రపనుల్లో వాటా కింద కానీ నవ్యాంధ్రకు రూ.2.06 లక్షల కోట్లు రానున్నాయి.

= పోలవరానికి ఎంత నిధులు ఇవ్వాలన్న దానిపై మదింపు జరుగుతోంది. సాగునీటి భాగం వరకూ మేం నిధులు ఇస్తాం.

= ఈశాన్య రాష్ట్రాలు.. కొండ రాష్ట్రాలు మినహా మిగిలిన వాటికిప్రత్యేక హోదా లేదని 14వ ఆర్థిక సంఘం ప్రకటించింది. ప్రధానమంత్రి ప్రకటన చేసినా అది అమలు సాధ్యం కాదని న్యాయశాఖ సలహా ఇస్తోంది. హోదా ప్రకటన చేసింది మేం కాదని తప్పించుకోవచ్చు. హోదాతోనే అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవం. నిధులు.. గ్రాంటుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. హోదా ద్వారా మీకేం వస్తుందో.. దానినే వేరే ప్రక్రియ ద్వారా (విదేశీ మద్దతు ప్రాజెక్టు) ఇస్తాం. ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. వందశాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పటం. రాజ్యాంగపరంగా హోదా సాధ్యమైతే.. ప్రత్యేక హోదా అమలైతే ఎంత మేర నిధులు అందేవో అంత మేరకు మాత్రమే ఏపీకి చెల్లిస్తాం.

= నా వరకూ.. డబ్బు.. పెట్టుబడి.. వనరులే అభివృద్ధికి బాటలు వేస్తాయి. హోదా అనేది ప్రమాణం లేని భావన. సెంటిమెంట్ తో అభివృద్ధి సాధ్యం కాదు. డబ్బుతోనే సాధ్యమవుతుంది. మొదటి ఏడాది ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లు అని రాష్ట్రం లెక్క వేసింది. ఆ మొత్తం ఒకేసారి ఇవ్వాలని కోరుతుంది. అది సాధ్యం కాదు. కేంద్రమే ఆదాయ లోటులో ఉంది. నిధులు ఇవ్వటానికి ఒక ప్రక్రియ ఉంటుంది. మా లెక్కలు.. రాష్ట్ర లెక్కలు వేరుగా ఉన్నాయి. ఇప్పటికే రూ.3900 కోట్లు ఇచ్చాం. మరింత మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో ఇస్తాం. ప్రత్యేక ప్యాకేజీని కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దాని ఆమోదం పొందితే చట్టబద్ధత వస్తుంది.

= ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకే చట్టబద్ధల లేదన్న నేపథ్యంలో బుధవారం చేసిన ప్రకటనకు చట్టబద్ధత ఉందా? (అన్న ప్రశ్నకు జైట్లీ బదులిస్తూ).. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు మాకున్న చిత్తశుద్ధిలో భాగమే బుధవారం నాటి ప్రకటన. గడిచిన 27నెలల్లో రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాం. ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వారుఆ ప్రాంతానికి చేసింది శూన్యం. మేం ఇప్పటికే రెండు ఆదాయపన్ను రాయితీల్ని ప్రకటించాం. ఈ రాయితీలుఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలకూ వర్తిస్తాయి.

= ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల మధ్య మేం ఎలాంటి తేడా గుర్తించటం లేదు. ప్రతి రాష్ట్రం తమ ఆర్థిక అవసరాలను ఎదుర్కొనేందుకు ఉన్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్నం. ప్రతి రాష్ట్రం ఆర్థిక లోటును పన్నుల్లో వాటా చెల్లింపు ద్వారా తీర్చాలన్నదే మా ఉద్దేశం. ఇలా పన్నుల్లో వాటా చెల్లించినా లోటు తీరని పక్షంలో ప్రత్యేకంగా రెవెన్యూ లోటు గ్రాంటు చెల్లించాలి.