Begin typing your search above and press return to search.

దోమలపై యుద్దం ప్రకటించిన ఢిల్లీ సీఎం!

By:  Tupaki Desk   |   19 Sep 2016 8:11 AM GMT
దోమలపై యుద్దం ప్రకటించిన ఢిల్లీ సీఎం!
X
యుద్దానికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. పార్టీలకు అతీతంగా యుద్దం చేయాలి అని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇంతకూ ఈయన ప్రకటించిన యుద్దం పాక్ పైనో - ఉగ్రవాదులపైనో - అవినీతిపైనో - నల్లధనం పైనో కాదు... దోమలపైన! అవును ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న చికెన్ గున్యా - డెంగ్యూ కేసుల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోమలపై పార్టీలకు అతీతంగా యుద్దం చేయాలని పిలుపునిచ్చారు.

యుద్ధానికి వెళ్లే సమయంలో ఎలాంటి సన్నాహాలు చేస్తామో.. చికెన్ గున్యా - డెంగ్యూ దోమలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు నడుంకట్టాలని ఢిలీ సీఎం పిలుపునిచ్చారు. ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమమంలో భారతీయులంతా ఏ రీతిగా ఏకమవుతారో - ఎలా ఒక్కతాటిపైకి వస్తారో అదే రీతిలో ఢిల్లీలోని ప్రమాదకర పరిస్థితులపట్ల ఏకమవ్వాలని కేజ్రీ తెలిపారు. దోమలకు కాంగ్రెస్ వాళ్లు - బీజేపీ వాళ్లు అని రాజకీయ తారతమ్యాలులు బేధాలూ ఏమీ ఉండవని, కాబట్టి వాటిపై కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇప్పటికే తాను ఆరోగ్యశాఖ మంత్రికి దోమల నివారణకు కావాల్సిన ఫాగింగ్ మెషిన్లను కొనుగోలు చేయాలని ఆదేశించించానని, అవి రెండు మూడు రోజుల్లో సమకూరుతాయని.. ప్రభుత్వం మీద - ప్రభుత్వ సంస్థలమీద ఆరోపణలు మాని ప్రతీ పౌరుడూ ఈ మేరకు దోమలపై పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. తాజాగా ఢిల్లీలోని దోమలు - వాటి ద్వారా ప్రభలే రోగాల పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ఈ సీఎం వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. గొంతు ఆపరేషన్ తర్వాత ఢిల్లీలో మాట్లాడిన సందర్భంగా కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.