Begin typing your search above and press return to search.

సామాన్య సీఎం చూపు రోడ్డు పక్కన పడింది

By:  Tupaki Desk   |   17 Oct 2015 7:09 AM GMT
సామాన్య  సీఎం చూపు రోడ్డు పక్కన పడింది
X
నిత్యం సామాన్యుడి గురించి ప్రస్తావిస్తూ.. వారి అండతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సామాన్యుల్ని ఏదేదో చేసేస్తానని చెప్పి.. వారిని ఊహాలోకాల్లో విహరించేలా చేసిన కేజ్రీవాల్ సైతం మాటలు వేరే.. చేతలు వేరన్న విషయాన్ని నిరూపించనున్నారు.

టిఫిన్లు.. స్నాక్స్ తినాలంటే హోటళ్లు.. రెస్టారెంట్లకు ఎంతమంది వెళతారో అందుకు ఎన్నోరెట్లు ఎక్కువగా రోడ్డు పక్కన పెట్టే ఫుడ్ ను తినే వారు ఉంటారు. చౌకగా ఉండటం ఒకటైతే.. ఇలాంటి వాటిల్లో కూడా నాణ్యతను పాటిస్తూ రుచిగా తయారు చేసే వారు ఉంటారు. అందరూ హోటళ్లు.. రెస్టారెంట్లకు వెళ్లి తినేంత ఆర్థిక పరిస్థితి ఉండదు.

అందుకే రోడ్డు పక్కన దొరికే ఫుడ్ తో కడుపు నింపుకునే వారు చాలామందే ఉంటారు.కానీ.. కేజ్రీవాల్ కు అలాంటి దుకాణాల మీద కన్నెర్ర చేశారు. రోడ్ల పక్కన ఉండే ఫుడ్ స్టాళ్లపై ఆయన సీరియస్ అయి.. ఇకపై ఎలాంటి ఆహారపదార్థాలు రోడ్ల పక్కన విక్రయించకూడదంటూ కేజ్రీవాల్ సర్కారు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సామాన్యుడే సీఎం అయితే.. సామాన్యుల కష్టాలు పోతాయనుకుంటే.. కొత్త కష్టం రావటంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సామాన్యుడ్ని సీఎం చేస్తే.. అదే సామాన్యుడి.. వేలాది మంది పొట్ట కొట్టటమేకాదు.. లక్షలాది మంది ఇబ్బంది కలిగించే నిర్ణయాన్ని తీసుకున్నారని వాపోతున్నారు. కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున వీధి వ్యాపారుల బతుకు అగమ్యగోచరంగా మారుతుందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు తగ్గట్లు తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా.. సామాన్యులు మాత్రం కేజ్రీవాల్ సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.