Begin typing your search above and press return to search.

కొంతమంది సీఎంల సెల్ ఫోన్లకు మోడీ నో

By:  Tupaki Desk   |   20 July 2016 4:28 AM GMT
కొంతమంది సీఎంల సెల్ ఫోన్లకు మోడీ నో
X
సుదీర్ఘ కాలం తర్వాత ఏర్పాటు చేసిన ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలో జరిగిన విషయం తెలిసిందే. సజావుగా సాగినట్లుగా కనిపించిన ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో బయటకు రాని కొన్ని అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రధానితో భేటీ అయ్యే రాష్ట్ర ముఖ్యమంత్రుల పట్ల మోడీ పక్షపాత వైఖరితో అనుసరించినట్లుగా విమర్శలు మొదలయ్యాయి. ఈ తరహా విమర్శనాస్త్రాన్ని సంధించింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ సమావేశం గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ సమావేశానికి హాజరైన కొందరు ముఖ్యమంత్రుల మొబైల్ ఫోన్లను సమావేశానికి అనుమతించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అంతే కాదు మరికొందరు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గళం వినిపించకూడదని కేంద్రం భావించిందని ఆరోపించారు. అన్నింటికి మించి.. మొబైల్ ఫోన్ల విషయంలోనే మోడీ సర్కారు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరు ముఖ్యమంత్రులకు మొబైల్ ఫోన్లతో అనుమతించి.. మరికొందరి విషయంలో మాత్రం వదిలేయటం ఏమిటన్న మాట ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యను చూస్తే.. ‘‘అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో నాతో సహా మరికొందరు ముఖ్యమంత్రులు తమ మొబైల్ ఫోన్లను బయటే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో.. మమతా బెనర్జీ లాంటి వారిని మాత్రం మొబైల్ ఫోన్లతో అనుమతించారు. సీఎంలతో మోడీకి ఏమైనా ముప్పు ఉందా? ఈ ప్రశ్నే నేను అడిగితే నా స్పీచ్ కు అడ్డంకులు ఎదురయ్యాయి. మొబైల్ ఫోన్ తో అనుమతించిన మమతా బెనర్జీని సమావేశంలో ఆమెను మాట్లాడనివ్వలేదు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గళం వినిపించకూడదని కేంద్రం భావిస్తే.. ఈ మీటింగ్ కు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించినట్లు?’’ అంటూ ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడీ సమావేశంపై సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయనటంలో సందేహం లేదు.