Begin typing your search above and press return to search.

దేశీయ జీఎస్టీకి పునాదులు తీసింది ఆయ‌నే

By:  Tupaki Desk   |   1 July 2017 5:31 AM GMT
దేశీయ జీఎస్టీకి పునాదులు తీసింది ఆయ‌నే
X
ఈ రోజున ఎక్క‌డ చూసినా జీఎస్టీ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇవాల్టి జీఎస్టీని ఎన్నో ఏళ్ల ముందు నుంచి క‌ల‌లు క‌న‌ట‌మే కాదు.. దాన్ని సాక‌రం చేయ‌టం కోసం తీవ్రంగా శ్ర‌మించిన వ్య‌క్తి ఒక‌రున్నారు. ఆయ‌నే.. ప్ర‌ఖ్యాత ఆర్థిక శాస్త్ర‌వేత్త అసిమ్‌దాస్ గుప్తా. దాదాపు ప‌న్నెండేళ్ల పాటుశ్ర‌మించి సంక్లిష్ట‌మైన జీఎస్టీ విధానానికి జీవం పోసిన వ్య‌క్తిగా ఆయ‌న్ను చెప్పాలి.

ఆర్థిక గ‌ణాంకాల్లో అందెవేసిన చేయి అయిన అసిమ్ దాస్‌.. మ‌ద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో డాక్ట‌రేట్ చేశారు. ఆయ‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ధానిగా ప‌ని చేసిన వాజ్ పేయ్ మాత్ర‌మే కాదు.. త‌ర్వాత ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌న్మోహ‌న్ సింగ్ కూడా గుర్తించారు. స్వ‌యంగా ఆర్థిక‌వేత్త అయిన మ‌న్మోహ‌న్ దేశంలో ప‌న్నుల వ్య‌వ‌స్థ‌లో పెను మార్పుల‌కు నాంది ప‌లికే జీఎస్టీకి అసిమ్ దాస్ మాత్ర‌మే చ‌క్క‌టి రూపు ఇవ్వ‌గ‌ల‌ర‌ని విశ్వ‌సించారు.

అందుకే ఆయ‌న‌కు ఆ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పారు. జీఎస్టీ విధివిధానాల గురించి అసిమ్ దాస్ అటు పారిశ్రామిక వ‌ర్గాలు.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. ఆర్థిక సంస్థ‌ల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. జీఎస్టీ క‌మిటీలో తొమ్మిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు స‌భ్యులుగా ఉండేవారు.

2011లో ప‌శ్చిమ‌బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అసిమ్ దాస్ గుప్తా జీఎస్టీ క‌మిటీ సార‌థ్యం నుంచి వైదొలిగారు. జీఎస్టీ విధానానికి తాను 80 శాతం రూపునిచ్చిన‌ట్లుగా అసిమ్ దాస్ స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఆయ‌న త‌ర్వాత కెఎం మ‌ణి.. అమిత్ మిత్రాలు జీఎస్టీకి సార‌థ్యం వ‌హించారు. ఈ రోజు జీఎస్టీ ఎలా క‌నిపించినా.. అందుకు మూలం మాత్రం అసిమ్ దాస్ గుప్తా అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రోజు నుంచి దేశ ప్ర‌జ‌లు జీఎస్టీ కార‌ణంగా ఎలాంటి లాభ న‌ష్టాలు పొందినా ఆ క్రెడిట్ మాత్రం ఆయ‌న‌కే చెందుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/